మేయర్ రేసులో ఆ ముగ్గురూ: కుమార్తె కోసం కేకే లాబీయింగ్: బొంతు పావులు: మజ్లిస్తో రొటేషన్?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో నిరుత్సాహాన్ని నింపాయి. ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ కొరవడింది. అత్యధిక డివిజన్లను గెలుచుకున్నప్పటికీ..మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైనంత సంఖ్యకు దూరంగానే నిలిచింది. ఎక్స్ అఫీషియో ఓట్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితిని చవి చూస్తోంది. మేయర్ స్థానం కోసం మజ్లిస్ సహకారాన్ని సైతం తీసుకోవాల్సి వస్తోంది. ఈ పరిణామాలను ఒకరకంగా..దీన్ని ఓటమిగానే భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.
మేయర్ పదవి కోసం రొటేషన్..
అవెలా ఉన్నప్పటికీ.. మేయర్ పీఠం టీఆర్ఎస్ చేజారదు. మేజిక్ ఫిగర్ను అందుకోవడానికి అవసరమైనన్ని ఎక్స్ అఫీషియో ఓట్లు టీఆర్ఎస్ చేతుల్లో ఉన్నాయి. అటు మజ్లిస్ కూడా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం లాంఛనప్రాయమే. మేయర్ పదవిని చెరి రెండున్నరేళ్ల పాటు పంచుకునేలా రొటేషన్ పద్ధతిని మజ్లిస్ నేతలు తెరమీదికి తీసుకుని రావచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో గులాబీ నేతలు దాన్ని అంగీకరించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇదివరకు మజ్లిస్-కాంగ్రెస్ రొటేషన్ పద్ధతిలో మేయర్ పదవీ కాలాన్ని పంచుకున్నాయి.
మేయర్గా ఎవరు?
మేయర్ అవకాశాన్ని ఎవరికి కల్పిస్తారనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ఈ పదవిని ఈ సారి మహిళకు కేటాయించారు. దీనితో పలువురి పేర్లు చర్చల్లోకొస్తున్నాయి. మాజీ మంత్రి, దివంగత పీ జనార్ధన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్గా ఆమె విజయం సాధించారు. పీజేఆర్ కుటుంబం ఇదివరకు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. ఆయన హఠాన్మరణం అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కుమార్తె విజయా రెడ్డి తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె ప్రస్థానం వైసీపీ నుంచే ప్రారంభమైంది. విభజన తరువాత టీఆర్ఎస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. టీఆర్ఎస్లో చేరిన తరువాత ఆమెకు ఎలాంటి పదవినీ ఇవ్వలేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. మేయర్గా విజయారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే...వ్యక్తిగతంగా పీజేఆర్కు ఉన్న ఇమేజ్ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందనే వాదనలు ఉన్నాయి.
కేకే కుమార్తె రేసులో..
టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి కూడా ఈ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆమె బంజారాహిల్స్ డివిజన్ నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. ప్రతిష్ఠాత్మక మేయర్ పీఠం కోసం కే కేశవరావు లాబీయింగ్ నిర్వహించడానికి అవకాశాలు లేకపోలేదు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు కేశవరావుపై సానుకూల అభిప్రాయమే ఉందని, విజయలక్ష్మి పేరును పరిశీలనలోకి తీసుకునే అవకాశాలను కొట్టి పారేయలేమని చెబుతున్నారు. తండ్రికి రాజ్యసభ స్థానాన్ని కేటాయించి, కుమార్తెకు మేయర్ పదవిని ఇవ్వడం వల్ల ఒకే కుటుంబానికి రెండు అత్యున్నత పదవులను ఇచ్చినట్టవుతుందని, ఇది అసంతృప్తికి దారి తీయొచ్చని అంటున్నారు.
రేసులో బొంతు రామ్మోహన్ కూడా..
మేయర్ పదవి రేసులో బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు. తన భార్య బొంతు శ్రీదేవి కోసం ఆయన పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. బొంతు శ్రీదేవి.. చర్లపల్లి డివిజన్ నుంచి విజయం సాధించారు.కేసీఆర్ కుటుంబానికి బొంతు రామ్మోహన్ ఆప్తుడనే పేరు ఉంది. ఈ సారి ఎన్నికల్లో బొటాబొటి డివిజన్లను సాధించడానికి మేయర్గా బొంతు రామ్మోహన్ వైఫల్యాలు కూడా ఓ కారణమని భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన భార్యకు ఆ అవకాశం ఇస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది.