రెచ్చగొట్టే వ్యాఖ్యలు... బండి సంజయ్,అక్బరుద్దీన్లపై సుమోటో కేసులు...
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న అభియోగాలతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్లపై ఎస్సార్ నగర్ పోలీసులు సుమోటో కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై మాట్లాడుతూ... హుస్సేన్ సాగర్ను ఆక్రమించి నిర్మించిన దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు ఘాట్,దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘాట్లను ప్రభుత్వం దమ్ముంటే కూల్చివేయాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్... పీవీ ఘాట్,ఎన్టీఆర్ ఘాట్ల జోలికొస్తే రెండు గంటల్లో దారుసలాంను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ ఇరువురి వ్యాఖ్యలు సామాజిక ఘర్షణలకు తావిచ్చేలా ఉన్నాయన్న ఆరోపణలతో ఇద్దరిపై పోలీసులు సుమోటో కేసులు నమోదు చేశారు.
మరోవైపు గ్రేటర్ ప్రచారంలో శనివారం(నవంబర్ 28) హేమాహేమీలు బరిలో దిగుతున్నారు. టీఆర్ఎస్ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి,ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. బీజేపీ తరుపున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేయనున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన కూడా ఇదే రోజు కావడం గమనార్హం. జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ ప్లాంట్కి వెళ్లనున్న ఆయన... అక్కడ కోవ్యాక్సిన్ తయారీని పరిశీలించనున్నారు.
ప్రధాని మోదీ అధికారిక పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రావొద్దని పీఎంవో కార్యాలయం కబురు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. గత సంప్రాదాయాలకు తిలోదకాలిచ్చేలా జారీ చేసిన కొత్త నిబంధనలు సీఎంవో అధికారులను ఆశ్చర్యపరిచాయి. ఏ ఉద్దేశంతో సీఎంను వద్దన్నారన్న దానిపై అధికారిక వర్గాలు చర్చించుకుంటున్నాయి.