గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్. పార్థసారథి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన పరోక్ష పద్దతిలో ఎన్నిక జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ జిల్లా కలెక్టర్ ఎన్నికల పరిశీలకునిగా వ్యవహరిస్తారు. గ్రేటర్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
Recommended Video
ఫిబ్రవరి 11న ఉదయం 11.00 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఆ రోజు కుదరకపోతే మరుసటి రోజు ఎన్నిక నిర్వహిస్తారు. 12ద తేదీ సెలవు ఉన్నప్పటికీ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక ప్రక్రియ పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని పరిశీలకునిగా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించనుంది.
గ్రేటర్లో 150 స్థానాలు ఉన్ సంగతి తెలిసిందే. 55 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందగా, 48 స్థానాల్లో బీజేపీ, 44 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలకు పరిమితమైంది. గత ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ సారి గట్టి పోటీ ఇచ్చింది. భారీగా సీట్ల సంఖ్యను కూడా పెంచుకుంది. ఈ సారి టీఆర్ఎస్, ఎంఐఎం విడివిడిగానే పోటీచేశాయి. పొత్తుపై ఇప్పటివరకు ప్రస్తావన రాలేదు. దీంతో మేయర్ పీఠం ఏ పార్టీ గెలుచుకుంటుందనే టెన్షన్ ఉంది.