ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా.. నో టెన్షన్.. జీహెచ్ఎంసీ సిబ్బంది వస్తున్నారుగా..!
హైదరాబాద్ : ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా? నిరుపయోగంగా పడి ఉన్న ఐటమ్స్ బయట పడేయటానికి ఇబ్బందులు పడుతున్నారా? ఇప్పుడు అలాంటి టెన్షన్ ఏమీ లేదంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. తమ సిబ్బంది మీ ఇంటి దగ్గరకే వచ్చి పాత వస్తువులను సేకరిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఓల్డ్ ఐటమ్స్ సేకరించడానికి "రీసైక్లథాన్ హైదరాబాద్" పేరిట వినూత్న ప్రయోగానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇళ్లు, కార్యాలయాలు ఏవైనా సరే పనికి రాని, పాడైన వస్తువులు ఉంటే గనక జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆశ్రయించవచ్చు. పాడైన పరుపులు, పనికి రాని కుర్చీలు, మంచాలు.. చెడిపోయిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు.. ఇలా ఏవైనా సరే మీరు పడేయాలనుకుంటే జీహెచ్ఎంసీ సిబ్బందికి చెప్పొచ్చు. ప్రతి డివిజన్లో ఇలాంటి వస్తువుల సేకరణ కోసం మూడు నుంచి నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేంద్రాల్లో మీరు పాత వస్తువులను అందించవచ్చు.
శివసేనకు ఎన్సీపీ జై కొట్టేనా.. సీఎం కుర్చీ బీజేపీ చేజారేనా?
అయితే చాలామంది పాత వస్తువులను పాడేయకుండా అలాగే ఓ మూలన పెడుతుంటారు. దాంతో అక్కడి పరిసరాలు అధ్వాన్నంగా మారడంతో పాటు దుర్వాసన వస్తుంటుంది. అంతేకాదు దోమలు వ్యాప్తి చెంది అనేక రోగాలకు కారణమవుతున్నాయి. డెంగ్యూతో పాటు విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు పైలట్ ప్రాజెక్ట్ కింద నిరుపయోగ వస్తువుల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే ప్రతి డివిజన్లో పనికిరాని వస్తువులను సేకరించేలా కార్యక్రమం రూపొందించారు.
ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు మాత్రమే ఈ డ్రైవ్ నడవనుంది. పది రోజుల పాటు నగర ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి డివిజన్లో ఆ మేరకు సేకరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆదివారం తొలిరోజు నాడు కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరించే దృశ్యాలు కనిపించాయి.