సూరత్ ఘటన సాక్షిగా.. అమీర్పేటలో 20 కోచింగ్ సెంటర్లకు తాళం
హైదరాబాద్ : నగరంలో 20 కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. మున్సిపల్ అధికారులు తాళాలు వేయడం చర్చానీయాంశమైంది. అమీర్పేట ప్రాంతంలో ఉన్న సదరు కోచింగ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారనే కారణంతో చర్యలు తీసుకున్నారు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన భద్రత చర్యలను గాలికొదిలేశాయని సదరు సంస్థను సీజ్ చేశారు. అయితే అవన్నీ కూడా ఐటీ శిక్షణ సంస్థలే కావడం గమనార్హం.
ఇటీవల సూరత్లోని ఓ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్టైనట్లు తెలుస్తోంది. ఆ ఘటనలో 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందుకే అలాంటి ప్రమాదాలకు నగరంలో తావు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆ క్రమంలో రెండు మూడు నెలల కిందటే అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో పుట్టగొడుగులుగా వెలసిన కోచింగ్ సెంటర్లకు నోటీసులు ఇచ్చారు.
బోనమెత్తిన భాగ్యనగరం.. పల్లెగా మారనున్న పట్నం
అయితే మున్సిపల్ అధికారుల నోటీసులు అందుకున్నవాటిలో దాదాపు 170 మంది ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తమకు కొంత గడువు కావాలని కోరారు. అంతలోపు ఫైర్ సేఫ్టీ భద్రతా ఏర్పాట్లు చేసుకుంటామని కోరారు. అయితే వాటిని మినహాయించిన అధికారులు.. ఇంతవరకు స్పందించని కోచింగ్ సెంటర్లపై మాత్రం చర్యలు తీసుకున్నారు. అందులోభాగంగా 20 ఐటీ ట్రైనింగ్ సెంటర్లకు తాళాలు వేశారు.
కొన్ని కోచింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విషయం బయటపడింది. అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని నిలువరించడానికి ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేసుకోలేదు. అంతేకాదు లోనికి కనీసం గాలి చొరబడే అవకాశం లేకుండా కిటికీలకు ఫ్లెక్సీలు, హోర్డింగులు ఫిక్స్ చేయడంతో ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ఛాన్స్ ఉంది. ఆ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.