150 డివిజన్లలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్: దొంగ ఓట్లకు చెక్ పెట్టే యాప్ పై మజ్లిస్ అభ్యంతరం
ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గతంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్లకు చెక్ పెట్టడానికి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను ప్రవేశపెట్టి పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని కేంద్రాలలో వినియోగించారు. అప్పట్లో పలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ ఆలస్యమవుతుందని కొంతమందికే ఈ యాప్ వినియోగాన్ని పరిమితం చేశారు . ఇప్పుడు మళ్లీ జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వినియోగిస్తున్నారు.
150 డివిజన్లలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్
150 డివిజన్లలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లకు చెక్ పెట్టడానికి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను వినియోగిస్తున్నారు. ఓటర్లు తమ వెంట తెచ్చుకున్న ఐడి కార్డుతో సంబంధం లేకుండా, యాప్ సహాయంతో వారిని ఈజీగా గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. ఓటర్ ఫేసు ఫోటో తీయడం తోనే ఈ యాప్ ఫోటోను ఎలక్షన్ కమిషన్ డేటాబేస్ నుంచి సదరు ఓటరు ఫోటోతో పోల్చి రిజల్ట్ ఇస్తుంది. 10 సెకన్లలోనే ఓటరు అసలైన ఓటరా లేక నకిలీ ఓటరా అనేది ఈ యాప్ తేల్చేస్తుంది.
దొంగ ఓట్లకు చెక్ పెట్టటానికి గతంలో మున్సిపల్ ఎన్నికల్లో .. ఇప్పుడు మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో
దేశంలోనే తొలిసారిగా దొంగ ఓట్లకు చెక్ పెట్టటానికి తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా ప్రయోగం చేసిన ఎన్నికల కమిషన్ ఓటర్ల ప్రామాణికతను ధృవీకరించడం ద్వారా ఎన్నికలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలనేలక్ష్యంతో ఈసారి జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఉపయోగించాలని నిర్ణయించింది. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని చేర్చడం పోలింగ్ సమయంలో దొంగ ఓట్లతో మోసం చేసేవారినిపట్టుకోటానికిఎన్నికల నిర్వహణ సంస్థకు సహాయపడుతుందని భావిస్తోంది.
కృతిమ మేథస్సు , మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటాల మేళవింపుగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్
గతంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలలో ఎంపిక చేసిన 10 పోలింగ్ కేంద్రాల్లోపైలెట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ని వినియోగించారు. ఈ యాప్ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి మున్సిపలిటీలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ను వినియోగించారు. కృతిమ మేథస్సు , మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటాల మేళవింపుగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ సాంకేతికత పనిచేస్తుందని అధికారులు చెప్తున్నారు . గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఈసారి అలాంటి టెక్నికల్ సమస్యలేవీ లేకుండా, ఆలస్యం కూడా జరగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
ఫేస్ రికగ్నైజేషన్ యాప్ విషయంలో మజ్లిస్ అభ్యంతరం
ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఈ యాప్ ని వినియోగించనున్నారు. అయితే ఈ యాప్ విషయంలో మజ్లిస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముస్లిం మహిళలు బురఖా వేసుకుని ఉంటారు కాబట్టి వారి ఫోటోలు తీయడానికి వీల్లేదని అభ్యంతరం తెలుపుతోంది. అయితే పాతబస్తీలోనే దీని అవసరం ఎక్కువ ఉంటుందని, అక్కడ ఎక్కువ దొంగ ఓట్లు పడతాయని పలు రాజకీయ పార్టీలు కచ్చితంగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పాతబస్తీలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్ ఎన్నికల్లో ఈ యాప్ వినియోగం
ఏదేమైనప్పటికీ ఈసారి ఎన్నికలలో 150 డివిజన్లలో ఒక్కో పోలింగ్ సెంటర్లో దొంగ ఓట్లకు చెక్ పెట్టడానికి మరోమారు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను వినియోగిస్తున్నారు. ఈసారి ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో మరిన్ని ఎన్నికలకు ఈ యాప్ ని వినియోగించే అవకాశం ఉంది. ఇక యాప్ ద్వారా తీసిన ఫోటోలను భద్ర పరచమని, పోలింగ్ కేంద్రంలో ఫోటో తీసిన వెంటనే ఎలక్షన్ కమిషన్ డేటాతో సరిపోలిన తర్వాత ఆ ఫోటోలు అన్ని డిలీట్ చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఫోటోల విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. కేవలం దొంగనోట్ల కు చెక్ పెట్టడం కోసమే ఈ విధానాన్ని తీసుకు వచ్చినట్లుగా ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.