పేదోడి పెళ్లాం ఊరందరికీ మరదలే -ఎంఐఎం చీఫ్ ఓవైసీ అనూహ్యం -నిలదీసిన మహిళలు, ఎంపీ జంప్
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీకి పెట్టని కోట లాంటి పాతబస్తీలో దాదాపు ఫస్ట్ టైమ్ ఓవైసీ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ తాకింది. సోమవారం జాంబాగ్ డివిజన్ లో తమ పార్టీ అభ్యర్థి రవీందర్ తరఫున ఓవైసీ ప్రచారం నిర్వహించగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని స్థానిక మహిళలు ఓవైసీని నిలదీశారు.
Recommended Video
కేసీఆర్తో ఓవైసీ ఢీ:గ్రేటర్లో పొత్తులేదు -బీజేపీ నేతలకు నిద్రలోనూ నా పేరే -సిటీకి మోడీ ఏమిచ్చాడు?
వరద సాయం ఇంటికి రూ.80వేలు
తాము కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా.. ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారంటూ స్థానిక మహిళలు నిలదీయడంతో.. వారికి సమాధానం ఇవ్వకుండానే ఎంపీ అసద్ అక్కడి నుంచి మెల్లగా వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే, వరద సాయంపై ఓవైసీ వెర్షన్ వెర్షన్ మరోలా ఉంది. ఆదివారం బాగా పోద్దుపోయిన తర్వాత ఆయన రెడ్ హిల్స్ డివిజన్ లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు. నిజంగా కేంద్రంలోని బీజేపీకి చిత్తశుద్ధి ఉండుంటే హైదరాబాద్ లో ఇళ్లు మునిగిన ఒక్కొక్కరికి రూ.80 వేల నుంచి రూ.1లక్షల వరకు సహాయం అంది ఉండేదన్నారు. అంతేకాదు, టీఆర్ఎస్ తో దోస్తీ, ఎంఐఎం పరిస్థితిపైనా విస్తృతంగా మాట్లాడారు. ఓవైసీ ఎమన్నారో ఆయన మాటల్లోనే..
రోహింగ్యాలను వెళ్లగొట్టండి..
‘‘బల్దియా వాసులంతా డిసెంబర్ 1న పోలింగ్ బూత్ లో బటన్ నొక్కడం కాదు.. బ్యాలెట్ పేపర్ లో పతంగి గుర్తు ఎక్కడుందో చూసి, ముద్ర వేయండి. దాన్ని జాగ్రత్తగా మడిచి, బాక్సులో వేయాలి. మీరంతా మరోసారి మజ్లిస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి. ఇప్పుడు జరుగుతున్నవి బల్దియా ఎన్నికలు. కానీ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలేవీ బల్దియా సమస్యలపైన మాట్లాడటం లేదు. ఎంఐఎం గెలుపు కోసం హైదరాబాద్ ఓటర్ లిస్టులో 40వేల మంది రోహింగ్యాలను చేర్చారని బీజేపీ ఆరోపిస్తోంది. వాళ్లతో టెర్రరిజం పెరుగుతోందని మాట్లాడుతున్నారు. అరేభాయ్.. దారుసలాంలో కూర్చొని ఓటర్ లిస్టును నేనా తయారుచేసింది? కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలేకదా? కేంద్రం, ఐక్యరాజ్యసమితి ఐడీకార్డులు ఇచ్చాకే కదా రోహింగ్యాలు హైదరాబాద్ లోకి అడుగుపెట్టింది? రోహింగ్యాలు ఇక్కడుంటే అమిత్ షా ఏం చేస్తున్నట్లు? ఇంటెలిజెన్స్ ఏమైపోయినట్లు? కావాలనుకుంటే వెళ్ల ఆ రొహింగ్యాలను మీరే వెళ్లగొట్టండి.. ఇంకోటి..
ట్యూబ్ లైట్ రేవంత్.. కిషన్రెడ్డితో గుసగుస..
నిన్ననే పారాచూట్ ద్వారా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హైదరాబాద్ లో ఊడిపడ్డారు. ఆయనంటాడు.. కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు ఓటేస్తే ఓవైసీకి ఫాయిదా జరుగుతుందని. అటు కాంగ్రెస్ వాళ్లేమో మనల్ని బీజేపీ బీ-టీమ్ అంటారు. ట్యూబ్ లైట్ కన్నా తక్కువ దిమాకున్న మల్కాజ్ గిరి ఎంపీ(రేవంత్ రెడ్డి)... రాజ్ భవన్ లో నేను కేంద్ర మంత్రి(కిషన్ రెడ్డి)తో అర నిమిషం మాట్లాడిన వీడియో చూపెట్టి అదే ఆధారం అంటాడు. అరే భాయ్, పబ్లిక్ గా మాట్లాడితే అందులో సీక్రెటేముంది? ఇక టీఆర్ఎస్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అయితే బీజేపీ వాళ్లను తిడుతూ ‘మీ మోదీ ఒంటరిగా ఓవైసీని కలవలేదా?'అని ప్రశ్నించాడు. లాక్ డౌన్ సమయంలో అధిక కరెంటు బిల్లుల్ని మాఫీ చేయాల్సింది పోయి ఆయనిలా మాట్లాడుతున్నాడు. ఇదీ తమాషా.. మొత్తం బల్దియా ఎన్నికల్లో పెళ్లికొడుకులా అందరికీ కనిపించే వ్యక్తిని నేనే అయ్యాను. ఇప్పటికే నాకు వయసైపోయింది.. వీళ్ల పిచ్చివాగుడు వినే ఓపిక నశించిపోతోంది..
పేద ముస్లింలకు ఓవైసీ చుక్కలు - కేసీఆర్ భారీ దోపిడీ -ఇవిగో సాక్ష్యాలు -కేంద్ర మంత్రి సంచలనం
సిటీకి కేంద్రం ఏమిచ్చింది?
అసలు 2014 నుంచి 2020 దాకా హైదరాబాద్ సిటీకిగానీ, తెలంగాణకు గానీ కేంద్రం ఏమిచ్చిందో లెక్కలు చెప్పే దమ్ము బీజేపీకి ఉందా? ఇటీవల భారీ వరదల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు, వాళ్ల వస్తులు పూర్తిగా పాడైపోయాయి. తీరా వరద తగ్గాకగానీ కేంద్ర బృందాలు ఇక్కడికి రాలేదు. ఆ అధికారులతో నేను మాట్లాడాను. చట్టం ప్రకారం వరద బాధితులకు సాయంలో 25 శాతం రాష్ట్రం, మిగిలిన 75 శాతం కేంద్రం భరించాలి. కానీ మొన్న టీఆర్ఎస్ సర్కారు మాత్రమే రూ.10వేలు ఇచ్చింది. అదే మోదీ సర్కారు కూడా బాధ్యత తీసుకుని ఉంటే ఒక్కొక్కరికి రూ.80వేల వరకు సాయం అంది ఉండేది. తద్వారా పేదలకు అన్యాయం జరిగింది.
ఎవడికి కావాలి టీఆర్ఎస్ దోస్తీ?
హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బీజేపీకి చేతనైంది ఏమీ లేదు. ఈ మధ్య టీఆర్ఎస్ అంటోంది.. మాకు ఐఎంఐఎంతో పొత్తు లేదని. అరెభాయ్.. నీతో కలుస్తామని మాత్రం అడిగిందెవడు? ఎన్నికల్లో టీఆర్ఎస్ తో ఏ రేంజ్ లో తలపడటానికైనా మేం సిద్ధం. టీఆర్ఎస్ కేవలం తెలంగాణకే పరిమితం, ఎంఐఎం మాత్రం ఇవాళ బీహార్ లోనూ సీట్లు గెలిచింది. రేపు వెస్ట్ బెంగాల్, ఎల్లుండి ఉత్తరప్రదేశ్, కర్ణాటక లోనూ గెలవబోతున్నాం. టీఆర్ఎస్ తోపాటు అన్ని పార్టీలూ ఒక ముఖ్యమైన విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి...
ఎంఐఎం పేదోడి పెళ్లాం కాదు..
ముస్లింలను, ఎంఐఎం పార్టీని భయపెట్టే రోజులు పోయాయి. ఇప్పుడు మీ బెదిరింపులకు లొంగేవాళ్లెవరూ లేరిక్కడ. పొత్తులు గిత్తులు లేవు.. చలో ఫైట్ చేద్దామనే అంటున్నాను. రాజకీయాలేమీ పెళ్లి బంధం లాంటి కాదు.. ఒక్కసారి మాటిస్తే కమిట్ అయి ఉండటానికి? మా పార్టీ గురించి, నా గురించి వాళ్లిలా అన్నారు, వీళ్లిలా అన్నారు, రియాక్షనేంటని మీడియా వాళ్లు అడుగుతున్నారు. అప్పుడు నాకు హైదరాబాదీ పాత సామెత ఒకటి గుర్తుకొస్తుంది. ‘పేదవాడి పెళ్లాం ఊరందరికీ మరదలు అవుతుంది' అనే రీతిలో ఎంఐఎం అంటే ప్రతివాడికీ లోకువే. మేం మాత్రం గట్టిగా బదులిస్తాం. పార్టీ పరంగా మా వ్యూహాలను అమలు చేస్తాం. పొలిటికల్ పిచ్చర్ మార్చే సత్తాను ఎంఐఎంకు ఆ దేవుడే ఇచ్చాడు'' అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.