కేటీఆర్ వల్లే డ్యామేజ్, కేసీఆర్ బలి -ఎత్తిపోతలంటే ఇదే -బీజేపీనీ తరుముడే: రేవంత్ ఫైర్
లీడర్ల మధ్య మాటల యుద్ధం.. పార్టీ ప్రచారాల మైకుల హోరుతో జీహెచ్ఎంసీ ఎలక్షన్ క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది. అన్నిపార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు హైదరాబాద్లో మకాం వేసి మరీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డి శుక్రవారం పలు ప్రాంతాల్లో రోడ్డుషో నిర్వహించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, బీజేపీ, ఎంఐఎంలను టార్గెట్ చేస్తూ రేవంత్ తీవ్రవిమర్శలు గుప్పించారు.
వ్యాక్సిన్ దండగ -మాస్కులు సుద్దవేస్ట్ -నేను వేసుకోను.. మావాళ్లకూ వద్దు -జగమొండి జైర్ మరో షాక్
ఎత్తిపోతలు అంటే ఇదే..
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థుల తరపున ఓటర్లను అభ్యర్థిస్తూనే.. సీఎం కేసీఆర్పై ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాలకుడు ఫాంహౌస్లో పడుకోవడమే తప్ప ఏం చేయడంటూ కేసీఆర్ని ఉద్దేశించి ఘాటు కామెంట్ చేశారు. పదే పదే కేసీఆర్ నోటి నుంచి ఎత్తిపోతల పథకం అనే మాట విని ఏదో అనుకునేవాడినని.. కానీ ఉదయం లేవగానే గ్లాసులో మద్యం ఎత్తడం, నోట్లో పోసుకోవడమనే విషయం ఇప్పుడే అర్థమైందని ఆయన అన్నారు. రాను రాను అది కూడా చేతగాక.. మంత్రి జగదీష్ రెడ్డికి గ్లాసు అందించే పని అప్పగించారంటూ సెటైర్లు గుప్పించారు. కరోనా, హైదరాబాద్ వరదల టైంలో కనిపించని టీఆర్ఎస్, బీజేపీలు.. ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వచ్చాయన్నారు. ప్రతిపక్షంలో ఎవరూ లేకపోతే ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుందన్న రేవంత్.. అదే జరిగితే రాష్ట్రంలో రాచరిక పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
క్రెడిట్ కాంగ్రెస్దే
హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ వాటా ఉందన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పీవీ హైవే బ్రిడ్జి, మెట్రో రైల్, రాజీవ్ స్వగృహ ఇళ్లు, ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చింది కాంగ్రెస్ అనే విషయం గుర్తుంచుకోవాలని ఓటర్లను రేవంత్ కోరారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీని పొలిమేరల వరకు తరిమికొట్టాలి అంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎంఐఎం, బీజేపీ మత రాజకీయాలు చేస్తూ.. ప్రజల మధ్య విభజన తెస్తున్నాయన్న రేవంత్.. ప్రజలు కొట్టుకు చస్తుంటే.. వారి ఓట్లతో ఆ రెండు పార్టీలు గద్దెనెక్కాలని చూస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్కు చేతకాదు
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడానికి మంత్రి కేటీఆర్ కారణమని రేవంత్రెడ్డి ఆరోపించారు. తండ్రి కేసీఆర్ కు అహంభావమని, కొడుకు కేటీఆర్ కు పాలన చేతకాదని అన్నారు. తండ్రీకొడుకుల మధ్య హైదరాబాద్ నలిగిపోతోందని చెప్పారు. పాలనపైన, వ్యవస్థలపైన కేటీఆర్కి ఏమాత్రం పట్టు లేదని రేవంత్ చెప్పారు.
కేసీఆర్కూ అది తప్పదు
దుబ్బాక విక్టరీతో కమలం పార్టీలో జోష్ నిండింది. రానున్న రోజుల్లో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న తరుణంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు నడుస్తున్నాయి. ఈ ఫిరాయింపులపై ఓ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి స్పందించాడు. ఫిరాయింపుల అడ్డాగా తెలంగాణని కేసీఆర్ మార్చాడని.. కత్తిని నమ్ముకున్నోడు కత్తికే బలైనట్టు... కేసీఆర్ కూడా ఫిరాయింపులకు బలయ్యే టైం త్వరలోనే రాబోతోందని అన్నారు.
కాంగ్రెస్ ఓటమి అందుకే
టీఆర్ఎస్కి షాకిస్తూ దుబ్బాక ఎన్నికలో బీజేపీ రఘునందన్రావు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఈ ఓటమిపై రేవంత్రెడ్డి స్పందిస్తూ.. టీఆర్ఎస్, బీజేపీలు మూడున్నర నెలల ముందే అక్కడ ప్రచారం మొదలుపెట్టాయని, అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడమే కాంగ్రెస్ ఓటమికి కారణమని రేవంత్ అన్నారు.
పవన్ కల్యాణ్ ఊసరవెల్లి -బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ -వెయ్యి జన్మలెత్తినా ఆయనలా కాలేరు: ప్రకాశ్ రాజ్