గ్రేటర్ పోల్స్: కాంగ్రెస్కు భారీ షాక్ -బీజేపీలోకి మాజీ ఎంపీలు సర్వే, కొండా! -ఏం జరుగుతోంది?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే బండ కార్తీక లాంటి సీనియర్లుపార్టీని వీడగా, మాజీ ఎంపీ విజయశాంతి సైతం కాషాయ కండువా కప్పుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కీలక నేతలుగా పేరుపొందిన మరో ఇద్దరు మాజీ ఎంపీలు హస్తానికి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్య నారాయణ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. కాంగ్రెస్ లోని కీలక నేతలను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఇంకొదరు కీలక నేతలతో కలిసి శుక్రవారం మహేంద్రహిల్స్లోని సర్వే సత్య నారాయణ ఇంటికి వెళ్లి, బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఎస్సీ సామాజిక వర్గానికే చెందిన మాజీ ఎంపీ వివేక్.. సర్వేను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో..
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి భూపేందర్ యాదవ్ శుక్రవారం కలిసినట్లు తెలుస్తోంది. విశ్వేశ్వర్రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. భూపేందర్ యాదవ్ విజ్ఞప్తిపై విశ్వేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఇద్దరు నేతలు బీజేపీలో చేరడంపై అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. బీజేపీ ప్రచార వ్యూహాంలో భాగంగానే కాంగ్రెస్ నేతలను కలుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా,
Recommended Video
ఇప్పటికే కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల ముగిసిన తర్వాత ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీ ఆగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. విజయశాంతి ఇంటికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.