రెండు అపార్ట్మెంట్ల మధ్య అచేతనంగా బాలిక, నిన్న అదృశ్యం, నేడు విగతజీవిగా...
హైదరాబాద్ వారాసిగూడలో దారుణం జరిగింది. ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. తమ కూతురు నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదని పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరునాడే బాలిక విగతజీవిగా కనిపించింది. దీంతో వారు శోకసముద్రంలో మునిగిపోయారు. బాలిక మృతికి గల కారణం తెలియరాలేదు. లైంగికదాడి చేసి, హత్య చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
విగతజీవిగా..
వారాసిగూడలో పరిధిలో గురువారం సాయంత్రం నుంచి బాలిక కనిపించడం లేదు. దీంతో పేరెంట్స్ ఆమె ఆచూకీ కోసం చూసి, గాలించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆమె కోసం గాలిస్తోన్నారు. ఇంతలో వారాసిగూడలో ఆ యువతి కనిపించింది. కానీ ఆమె చనిపోవడంతో ఏం జరిగిందనే చర్చకు దారితీసింది.
రంగంలోకి క్లూస్ టీం..
రెండు అపార్ట్మెంట్ల మధ్య బాలిక మృతదేహాం కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల సమాచారంతో క్లూస్ టీం కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించింది. బాలిక పడిపోయిన ప్రాంతంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. అపార్ట్మెంట్ సమీపంలో సీసీటీవీ ఫుటేజీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
అదుపులో ఇద్దరు..
ఫుటేజీ ఆధారంగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారెవరు, బాలికతో పరిచయం ఉందా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. బాలిక హత్య గురించి వారిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు యువతిపై లైంగికదాడి చేసి.. హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక బట్టి ఏం జరిగిందనే అంశంపై క్లారిటీ వస్తోందని పోలీసులు తెలిపారు.