మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వండి, బండి సంజయ్కు కవిత కౌంటర్
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్.. కామెంట్లు చేస్తుండగా.. అదే స్థాయిలో కౌంటర్ అటాక్ టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇస్తున్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారిపోయిందని బండి సంజయ్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న సర్కారు వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్మరిస్తోందని ఆయన అన్నారు. దీనిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు.
మేడారం జాతర కంటే ముందు రాజన్న ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోందని.. అలాంటిది రాజన్న ఆలయంలో సౌకర్యాలపై పట్టించుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. దీంతో మళ్లీ మాటల యుద్దం మొదలైంది. దీనిపై కవిత స్పందిస్తూ.. ముందు మేడారానికి జాతీయ హోదా తేవాలని కోరారు. ప్రత్యేక నిధులు కేటాయించి ఆ తర్వాతే మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెంటనే ఆమోదింపచేయాలని పేర్కొన్నారు.

2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని కవిత మండిపడ్డారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అడిగినా పట్టించుకోలేదని కవిత ఆరోపించారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ, గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలో ఉండడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో నాలుగు పర్యాయాలు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణకు సీఎం కేసీఆర్ రూ.332.71 కోట్లు విడుదల చేశారని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించదు.. జాతీయ హోదా ఇవ్వదు అని కవిత ఫైరయ్యారు. పైగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటీ అని తప్పుపట్టారు. బీజేపీ నేతలు చేసే విమర్శలను అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఊరికే విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. కావాలనే ఆరోపణలు చేయడం ఏంటీ అని మండిపడ్డారు.