ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాసీం అరెస్ట్, ఖండించిన సీపీఐ నేతలు, కోర్టును ఆశ్రయిస్తానంటోన్న భార్య
ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇటీవలే విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. దీనిని సీపీఐ నేతలు ఖండించారు. ఖాశీం అరెస్ట్పై కోర్టు ఆశ్రయిస్తామని ఆయన భార్య స్నేహలత తెలిపారు.
గడ్డపారతో తలుపు పగలగొట్టి..
ఖాశీం ఇంట్లో శనివారం ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు చేసే సమయంలో పోలీసులు దూకుడుగా ప్రవర్తించారు. గడ్డపారతో తలుపులు పగులగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోని ప్రతీ వస్తువును తనిఖీ చేయడమే గాక కంప్యూటర్ హార్డ్ డిస్క్లను, పుస్తకాలను తీసుకెళ్లారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ పోలీసులు దాడులు చేశారు.
3 నెలల నుంచి కేసులు..
ఖాశీం ఇంటిపై పోలీసుల దాడిని సీపీఐ నేతలు ఖండించారు. నిర్భంద తనిఖీలు చేయడం ఏంటి అని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. ఇంట్లో సోదాలు చేసేందుకు ఖాశీం సాయుధ పోరాటం చేయలేదన్నారు. తన భావజాలంతో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారని పేర్కొన్నారు. వర్సిటీలో మంచి ప్రొఫెసర్గా పేరు సంపాదించిన ఖాశీంను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. మూడు నెలల నుంచి కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేసి.. ఇవాళ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డి కూడా ఖాశీం అరెస్ట్ను ఖండించారు.
పుస్తకాల ఆధారంగా కేసులు..
తమ ఇంట్లోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించారని ఖాశీం భార్య స్నేహలత తెలిపారు. ఐదేళ్ల క్రితం జరిగిన కేసుకు సంబంధించి శనివారం సోదాలు చేశారన్నారు. 2016లో అక్రమంగా ఓ కేసు బనాయించారని.. దానిని బూచీగా చూపించి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లెప్పుడు శ్యాం సుందర్ అనే వ్యక్తి వద్ద దొరికిన పుస్తకాల ఆధారంగా కేసు నమోదు చేశారని చెప్పారు.
ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..?
‘నేను తెలంగాణ వాడినే' పుస్తకంతోపాటు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై రాసిన పుస్తకాలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. తప్పులకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని.. దీనిపై తాను కోర్టుకెళతానని స్నేహలత తెలిపారు.