వీళ్లు మామూలు "దొంగలు" కాదయ్యో..! టెక్నాలజీతో "మేకలు" మాయం
హైదరాబాద్ : సాంకేతికత విప్లవంతో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ సేవలు ఎంతలా ఉపయోగకరంగా ఉన్నాయో అంతేలా మోసాలకు ఊతమిస్తున్నాయి. టెక్నాలజీ లొసుగులతో "సైబర్ దొంగలు" ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటే.. హైదరాబాద్ లో తాజాగా వెలుగు చూసిన ఘటన నిపుణులను విస్తుపోయేలా చేసింది. గూగుల్ పుణ్యమా అని నెట్ లో ఏది కావాలంటే అది దొరికే సౌలభ్యముంది. దీంతో నేరగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో అందినకాడికి దోచుకుంటున్నారు.
అసలు విషయానికొస్తే గూగుల్ మ్యాప్ సాయంతో మేకలు, గొర్రెలు మాయం చేస్తున్న ముఠాకు హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. ఎల్బీనగర్ సీసీఎస్, కందుకూరు పీఎస్ పోలీసుల జాయింట్ యాక్షన్ లో భాగంగా ఈ ముఠా గుట్టురట్టైంది. దర్యాప్తులో దొంగల ముఠా సభ్యులు చెప్పిన వివరాలు ఆసక్తికరంగా మారాయి.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పోతుబండ తండాకు చెందిన 28 ఏళ్ల వయసున్న ఇస్లావత్ బాజేందర్ వ్యవసాయం చేస్తుంటాడు. అయితే అదనంగా డబ్బు సంపాదించాలనే కోరిక పుట్టడంతో గొర్రెలు, మేకలు దొంగిలించడం ప్రారంభించాడు. ఇబ్రహీంపట్నం డివిజన్ లోని కందుకూరు, మంచాల, యాచారం ఠాణాల పరిధిలోని గ్రామశివార్లలో తొలుత రెక్కీ నిర్వహించి.. కాపలా తక్కువగా ఉండి జనసంచారం లేని ఏఏ ప్రాంతాల్లో మేకలు, గొర్రెల మందలుంటాయో గుర్తించేవాడు. ఇలా ఈ ప్రాంతాలను గూగుల్ మ్యాప్ సాయంతో తన బంధువు 25 ఏళ్ల వయసున్న రత్లావత్ చిన్నకు వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేసేవాడు. ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న చిన్న గూగుల్ మ్యాప్ ఆధారంగా ఆ లొకేషన్లకు చేరుకోవడంతో.. ఇద్దరూ కలిసి మేకలు, గొర్రెలను దొంగిలించి ఆటోలో తరలించేవారు.
పక్కా సమాచారంతో మాటు వేసిన పోలీసులు దెబ్బడగూడ చౌరస్తా దగ్గర వీరిని అదుపులోకి తీసుకున్నారు. మంచాల, కందుకూరు, యాచారం పోలీస్ స్టేషన్ల పరిధిలో 90 మేకలు, గొర్రెలను దొంగిలించినట్లు తెలిపారు. 5 లక్షల రూపాయల నగదుతో పాటు రెండు సెల్ఫోన్లు, రెండు ఆటోలు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు.