బంగారు లడ్డు వేలం.. పోటాపోటీ.. చివరకు ఎంత పలికిందంటే..!
హైదరాబాద్ : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో నిమజ్జనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. లడ్డు వేలం కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 1994లో తొలుత బాలాపూర్ గణేశ్ లడ్డు వేలం ప్రక్రియ మొదలు.. ప్రతి ఏటా వివిధ వినాయక మండపాల దగ్గర లడ్డును యాక్షన్ వేస్తున్నారు. నవ రాత్రులు గణనాధునికి ఘనంగా పూజలు చేయడం ద్వారా లడ్డుకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. ఆ క్రమంలో లడ్డును సొంతం చేసుకుంటే తమకు కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు. దాంతో లడ్డు ధర ఎంతైనా సరే వేలం పాటలో పాల్గొని దక్కించుకుంటున్నారు.
అదే కోవలో హైదరాబాద్ భోలక్పూర్ డివిజన్లో శ్రీ సిద్ధి వినాయక భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ కొన్నేళ్లుగా గణేశ్ మండపం ఏర్పాటు చేస్తున్నారు. అలా ఇక్కడ కూడా లడ్డు వేలం ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రసాదం లడ్డుతో పాటు బంగారు లడ్డును ఏర్పాటు చేసి వేలం వేయడం ఆనవాయితీగా వస్తోంది.
1994లో 450.. ఇప్పుడేమో లక్షలు.. బాలాపూర్ లడ్డు ప్రస్థానం ఇలా
భోలక్పూర్ డివిజన్ గణేశ్ మండపం దగ్గర బుధవారం నాడు నిర్వహించిన లడ్డు వేలం కోలాహలంగా మారింది. భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు 5 లక్షల రూపాయల విలువ చేసే 123 గ్రాముల (12 గ్రాముల చొప్పున దాదాపు 10 తులాలు) బంగారు లడ్డును చేపల వ్యాపారి భైరి విష్ణు ప్రసాద్ సొంతం చేసుకున్నారు.
బంగారు లడ్డును దక్కించుకోవడానికి చాలా మంది పోటీపడ్డారు. నిర్వాహకులు 5 వేల ఒక్క రూపాయితో వేలం పాటను ప్రారంభించారు. అలా చివరకు 7 లక్షల 56 వేల ధర పలికి భైరి విష్ణు ప్రసాద్ దక్కించుకున్నారు. గణనాధుడి మహా ప్రసాదంగా భావించే ఈ లడ్డును సొంతం చేసుకుంటే తమకు కలిసి వస్తుందని భక్తుల నమ్మకం. ఆ క్రమంలోనే లడ్డు వేలం పాట ప్రక్రియకు ఏ ఏటికాయేడు ఆదరణ పెరుగుతోంది.