కుక్కర్ లో, డ్రిల్లింగ్ మెషిన్ లో బంగారం .. కాదేది స్మగ్లింగ్ కు అనర్హం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎంత నిఘా ఉన్నప్పటికీ రోజూ ఏదో ఒక రూపంలో బంగారం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది . ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు ఎంత భద్రతా ప్రమాణాలు తీసుకున్నా కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అంటూ స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. మార్చి 23 శనివారం ఎయిర్ పోర్టులో మరోమారు భారీగా బంగారం పట్టుబడింది. ఇద్దరు వ్యక్తుల నుంచి 820 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు నిర్వహిస్తున్న సోదాల్లో అక్రమ రవాణా చేస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి, రియాద్ నుండి హైదరాబాద్ కు వేర్వేరు విమానాల్లో వస్తున్న ప్రయాణికులను తనిఖీ చేశారు. ఒకరు డ్రిల్లింగ్ మిషన్ లో మరొకరు కుక్కర్ లో బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు.
చూడటానికి ఇనుప రాడ్ ... లోపల బంగారం ...షాక్ అయ్యేలా ఎయిర్ పోర్ట్ లో స్మగ్లింగ్
రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 600 గ్రాముల బంగారం, దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 220 గ్రాముల బంగారం పట్టుడింది. దీంతో ఆ ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి నుంచి 820 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి డ్రిల్లింగ్ మిషన్, కుక్కర్ లను సైతం బంగారం అక్రమ రవాణా కు వినియోగించటం చూస్తే కాదేదీ స్మగ్లింగ్ కు అనర్హం అని చెప్పక తప్పదు.
ఇలా ప్రతీ వస్తువు విప్పి , పగలగొట్టి చూడటం కస్టమ్స్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. బంగారం అక్రమ రవాణా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా జోరుగా సాగుతున్న నేపధ్యంలో అధికారులకు ఈ తరహా పరిశీలన తప్పటం లేదు.