ఆర్డీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. బస్టాండ్లలో ఇక ఆధునిక హంగులు
హైదరాబాద్ : ఇక ఆర్టీసీ బస్టాండ్లకు ఆధునిక హంగులు సొబగులు అద్దనున్నారు. రాజధాని హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు రోజు 6 వేల బస్సులు వెళ్తుంటాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా, ఆధునిక తరహాలో బస్ స్టేషన్లు తీర్చిదిద్దాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. లక్నోలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పద్ధతిలో నిర్మించిన అలంబాగ్ బస్ స్టేషన్ ఆర్టీసీ ఉన్నతాధికారులు పరిశీలించారు.
సులభంగా .. సౌఖ్యంగా గమ్యస్థలానికి ..
ప్రయాణికులు మరింత సులభంగా జిల్లాలకు వెళ్లేలా టీఎస్ ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. సిటీలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోన్న క్రమంలో .. జిల్లాల నుంచి వచ్చే బస్సులను శివారు ప్రాంతాలకే పరిమితం చేయాలని భావిస్తోంది. శివారులోని ఉప్పల్, ఎల్బీనగర్, మెహిదీపట్నం, ఆరంఘర్, లింగంపల్లి స్టేషన్లు అధునిక హంగులతో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆయాచోట్ల స్థలం పరిశీలించి బల్దియాకు ఆర్టీసీ లేఖ కూడా రాసింది. దీనిపై హై లెవల్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత ఆయా చోట్ల పనులు ప్రారంభమవుతాయి. వీటిలో మినీ థియేటర్లు, షాపింగ్ మాల్స్ నిర్మించాలని భావిస్తున్నారు. దీంతోపాటు ఫుడ్ కోర్టులు, విశ్రాంతి గదులు, గేమింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. దీంతో ఆర్టీసీకి ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. ఇలా ఆధునిక హంగులు కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అటు నుంచి అటే బస్సులు ..
ఉప్పల్లో కొత్త బస్టాండ్ నిర్మిస్తే వరంగల్ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఇక్కడ నుంచే ప్రయాణాలు సాగిస్తారు. ఇక ఎల్బీనగర్ నుంచి విజయవాడ, నల్గొండ వెళ్లే ప్రయాణికులు, మెహిదీపట్నం నుంచి వికారాబాద్, రంగారెడ్డి, శంకర్పల్లి .. ఆరంఘర్ బస్టాండ్ అందుబాటులోకి తెస్తే మహబూబ్నగర్, కర్నూలు, బెంగుళూర్, శంషాబాద్ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గమ్యస్థానాల చేరిక సులభమవుతోంది. మియాపూర్- లింగంపల్లి ప్రాంతాల్లో బస్టాండ్లు నిర్మిస్తే సంగారెడ్డి, జహీరాబాద్, పుణే రూట్లలో వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ సమస్య లేకుండా ఆర్టీసీ బస్సు ల్లో గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుంది.
రద్దీ తగ్గించడానికి ఇలా ..
ప్రస్తుతం ఎంజీబీఎస్, జేబీఎస్ గుండా వెళ్లే బస్సులతోపాటు గ్రేటర్ ఆర్టీసీ నడుపుతున్న 3,650 సిటీ బస్సులు రోడ్డుపైకి వస్తున్నాయి. ఎంజీబీఎస్ నుంచి 4 వేల బస్సులు, జేబీఎస్ నుంచి 1200 పైగా బస్సులు జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో గ్రేటర్ రోడ్లపై ప్రతిరోజు పదివేలకు పైగా బస్సులు వస్తుండంతో భారీ ట్రాఫిక్ జాం అవుతోంది. వీటికి తోడు 300-350 ప్రైవేట్ బస్సు లు సైతం నగర రోడ్లపైకి వస్తుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ దిగ్బందంలో చిక్కుకుంటున్నారు నగరవాసి. శివార్లలో కొత్త బస్టాండ్లు నిర్మిస్తే నగరంలోకి వస్తున్న బస్సులను తగ్గించుకోవడంతో పాటు శివార్ల నుంచి ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉంది.
పండుగల సమయంలో అంతే ..
ఇక పండుగల సమయంలో సరి .. సంక్రాంతి, దసరా పండుగ రోజుల్లో హైదరాబాద్ నుంచి 4 వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఎంజీబీఎస్ నుంచి ప్రతిరోజు జిల్లాలకు సుమారు 1.6లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. సెలవులు, పండుగరోజుల్లో ఈ సంఖ్య 3 లక్షల వరకు ఉంటోంది. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఆధునిక తరహాలో బస్టాండ్లు నిర్మిస్తే ఎంజీబీఎస్ నుంచి రాకపోకలు సాగించే సుమారు 2 వేలకు పైగా బస్సులను అక్కడి నుంచే అపరేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. దీంతో ఎంజీబీఎస్లో బస్సుల రద్దీ తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కా రం లభిస్తోందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కొత్త బస్టాండ్ల నిర్మాణంతో సిటీలో రోడ్లలో రద్దీ తగ్గి ... ఎక్కడి ప్రయాణికులు అక్కడినుంచే వెళ్లిపోయే అవకాశం ఉంది.