గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవీ..? పరిశీలిస్తోన్న సీఎం కేసీఆర్, ఆ రెండు సీట్లు వారికేనా..?
తెలంగాణ రాష్ట్రంలో మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఆశావాహులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. రెండింటీలో సిట్టింగులకే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ గులాబీ దళపతి కేసీఆర్ మదిలో ఏముందో తెలియడం లేదు. ఇటీవల కేసీఆర్ను ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ బెర్త్ కన్ఫామ్ అనే ప్రచారం జరుగుతోంది.
వివక్షతో కాదు విచక్షణతో.. సీఎం కేసీఆర్ కామెంట్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్..
తెరపైకి గోరటి వెంకన్న పేరు..
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో గోరటి వెంకన్న పేరు తెరపైకి వచ్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గోరటి వెంకన్న పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ను కలిశారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి వెంకన్న వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ విధానాలను బాహాటంగా విభేదించిన సందర్భాలు కూడా లేవు. ఈ క్రమంలో గోరటి వెంకన్న పేరు ఎమ్మెల్సీ కోటా అభ్యర్థుల రేసులో ముందువరసలో ఉంది.
వైఎస్ఆర్, చంద్రబాబు.. కేసీఆర్..
గోరటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతోందో పాట బాగా ఫేమస్ అయ్యింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడానికి రావటానికి ముందు వైఎస్ఆర్ నిర్వహించిన పాదయాత్రలో పాటను బాగా వినియోగించుకున్నారు. తర్వాత గోరటి వెంకన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు ఎంపీ సీటుకు పోటీ చేసే ఆసక్తి ఉందో కనుక్కోవాలని వైఎస్ వాకబు చేయించారని తెలిపారు. తర్వాత చంద్రబాబు కూడా తనపై ప్రేమ చూపేవారన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కోసం వెంకన్న పేరు తెరపైకి వచ్చింది.
3 సీట్ల కోసం.. వీరే పోటీ..
గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సభావత్ రాములునాయక్ సీటు మార్చి 2న ఖాళీ కాగా, నాయిని నర్సింహారెడ్డి జూన్ 19న, కర్నె ప్రభాకర్ ఆగస్టు 17న ఖాళీ అయింది. కర్నె ప్రభాకర్కు మళ్లీ సీటు పక్కా అనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేత నాయినిపి కూడా నిరాశపరచక పోవచ్చని చెబుతున్నారు. మూడో స్థానం కోసం మొదటి నుంచీ మాజీ ఎంపీ సీతారాంనాయక్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, తుల ఉమ, గుండు సుధారాణి, పిడమర్తి రవి, తక్కళ్లపల్లి రవీందర్రావు, చాడ కిషన్రెడ్డి, ఆర్ సత్యనారాయణ, జీ దేవీప్రసాదరావు, బొమ్మెర రామ్మూర్తి, మర్రి రాజశేఖర్రెడ్డి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
పీవీ కూతురుకు కూడా
పీవీ శత జయంతి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూతురు సురభి వాణిదేవి పేరును కూడా ఎమ్మెల్సీ సీటు కోసం పరిశీలిస్తారనే చర్చ జరిగింది. మూడింటిలో ఒక సీటు ఎస్సీ ఎస్టీల్లో ఒకరికి దక్కే అవకాశం ఉంది. గోరటి వెంకన్న పేరు సీఎం పరిశీలనలోకి వచ్చిందని సమాచారం. దీనిపై త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే మూడు సీట్లకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు.