రాజా ది గ్రేట్.. బీజేపీకి మిగిలింది ఆ ఒక్కడే
హైదరాబాద్ : బీజేపీని ఆ ఒక్కడు కాపాడారు. రాజా ది గ్రేట్ అనిపించుకున్నారు. 2014లో 5 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి అనూహ్యంగా ఒక్క సెగ్మెంట్ లోనే విజయం సాధించింది. హైదరాబాద్ గోషామహల్ నుంచి కమలం గుర్తుపై పోటీచేసిన రాజా సింగ్ గెలుపొందారు. ప్రత్యర్థి ముఖేష్ గౌడ్ పై విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలైనా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరిన బీజేపీకి చేదు అనుభవమే ఎదురైంది. 2014 లో గెలిచిన 5 స్థానాలను కూడా కాపాడుకోలేకపోయింది. అంబర్ పేట నుంచి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టాలని (హిమాయత్ నగర్ నుంచి గెలుపొందింది కాకుండా) ఆశపడ్డ కిషన్ రెడ్డికి పరాభవం మిగిలింది. ముషీరాబాద్ నుంచి బరిలో నిలిచిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఓటమి పాలయ్యారు. ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అపజయం పాలయ్యారు.
ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లాంటి దిగ్గజాలు ప్రచారం చేసినా కూడా బీజేపీకి కలిసిరాలేదు. మొత్తానికి గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే గెలిచి అభినందనలు అందుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ఒకే ఒక్కడు, సింగిల్ సింహం అంటూ అభిమానులు, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.