ఆపరేషన్ నిజాముద్దీన్ మర్కజ్ : కూపీ లాగుతున్న ప్రభుత్వం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా సోమవారం(మార్చి 30) ఒక్కరోజే 227 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అదుపులోనే ఉందని.. అంతా భావిస్తున్న తరుణంలో నిజాముద్దీన్ మర్కజ్ మసీదు మత ప్రార్థనల గురించి బయటపడటం ఒక్కసారిగా ఆందోళన పెంచింది. ముఖ్యంగా తెలంగాణలో నమోదైన ఆరు కరోనా మృతులు నిజాముద్దీన్ మర్కజ్కి వెళ్లి వచ్చినవారే కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో రాష్ట్రంలో అసలు మొత్తం ఎంతమంది మర్కజ్కు వెళ్లారన్న వివరాలను ప్రభుత్వం కూపీ లాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Recommended Video
తెలంగాణ నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లినవారి గురించి ఇప్పటికిప్పుడు స్పష్టమైన లెక్కలేమీ చెప్పలేమని.. కానీ వారి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. వారి ట్రావెల్ హిస్టరీని సేకరిస్తున్నామన్నారు. వారు ఎవరెవరితో కలిశారు.. ఎక్కడెక్కడ తిరిగారు వంటి వివరాలను సేకరిస్తున్నట్టు చెప్పారు. నిజానికి ఇటీవలే తెలంగాణలో 12 మంది నెగటివ్ అని తేలడంతో ఒకింత ఊరట చెందామన్నారు. సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయం చెప్పారని గుర్తుచేశారు. బయటిదేశాల నుంచి ఎవరూ వచ్చే అవకాశం లేకపోవడం.. ఏప్రిల్ 6వ తేదీతో కొంతమంది క్వారెంటైన్ పూర్తవుతుండటంతో.. పరిస్థితి సానుకూలంగానే ఉంటుందని ప్రభుత్వం భావించిందన్నారు. కానీ నిజాముద్దీన్ మర్కజ్ ఒక్కసారి తెర పైకి రావడంతో పరిస్థితి మారిపోయిందన్నారు.
ఇక తెలంగాణలో వలస కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని చెప్పారు. మొత్తం 9లక్షల మంది వలస కార్మికులను గుర్తించి వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఒక్క హైదరాబాద్లోనే 170 క్యాంపులను ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించామన్నారు. ఇప్పటికీ పెట్రోలింగ్ జరుగుతూనే ఉందని.. ఇంకా ఎవరైనా వలస కార్మికులు ఎక్కడైనా చిక్కుకుపోతే.. వారికి కూడా సాయం చేస్తామని చెప్పారు.
కాగా,ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో నిర్వహించిన మత ప్రార్థనల్లో తెలంగాణ నుంచి 1030-2000 పైచిలుకు మంది హాజరై ఉంటారని అంచనా వేస్తున్నారు. అక్కడినుంచి వచ్చాక వీరు స్థానిక మసీదుల్లో గెట్ టు గెదర్స్ నిర్వహించారని చెబుతున్నారు. దీంతో ఒకవేళ వారికి వైరస్ సోకి ఉంటే.. పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైతే తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77గా ఉంది. పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.
We are doing our best in terms of identifying the exact number of people from Telangana who attended the Nizamuddin congregation (in Delhi) and also tracing who all they have come in contact with: Telangana Minister KT Rama Rao. pic.twitter.com/zDoNAh06M8
— ANI (@ANI) March 31, 2020