61 కాదు.. రిటైర్మెంట్ వయసు పెంపు రెండేళ్లే..!
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు రెండేళ్లుగానే ఉండనుంది. 58 ఏళ్లకు రిటైర్మెంట్ కావాల్సి ఉన్నా.. ఎన్నికల మేనిఫెస్టోలో 61 ఏళ్లకు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని ప్రకారం రిటర్మైంట్ వయసు మూడేళ్లు పెరగాలి. కానీ కొన్ని కారణాలతో రెండేళ్లకు ఓకే చేస్తూ.. 60 ఏళ్లకు ఫిక్స్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
61 కాదు.. అరవయ్యే..!
రిటైర్మెంట్ వయసును మరో రెండేళ్లు పెంచుతూ.. ఏప్రిల్ నుంచి అమలు చేయాలన్నది ప్రభుత్వ అంతరంగంగా కనిపిస్తోంది. ఆ మేరకు ప్రక్రియ మొదలుపెట్టినట్లు సమాచారం. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచితే, న్యాయపరమైన చిక్కులొచ్చే ప్రమాదముందని భావించడంతోనే 60 ఏళ్లకు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగులకు ఇచ్చిన హమీలు నెరవేర్చడంతో పాటు ఖాళీలు భర్తీచేసి నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించాలనే ధోరణితో సీఎం కేసీఆర్ ఉన్నారట.
మొదట రెండేళ్లే?
ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపును ఈ ఏడాది నుంచే అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ యోచన. అయితే మొదటగా రెండేళ్లు పెంచి.. తర్వాత 3 ఏళ్లకు పెంచే అంశం పరిశీలించే అవకాశాలున్నట్లు సమాచారం. దీన్నిబట్టి 2021 వరకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు కానుంది. ఈ రెండేళ్లలోనే దాదాపు 15 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయొచ్చనేది ఆర్థికశాఖ అంచనా. పదవీ విరమణ అనంతరం ఆయా ఉద్యోగులకు ప్రోత్సహకాల కింద ఇచ్చే మొత్తం 2వేల కోట్ల రూపాయలుగా ఉండనున్నట్లు లెక్కలు తేల్చింది. మరోవైపు ఇదే రెండేళ్లలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం.
రెండేళ్ల తర్వాత మూడేళ్లపై పునరాలోచన..!
ఎన్నికల హామీ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 3 ఏళ్లు పెంచుతూ 61 సంవత్సరాలకు ఫిక్స్ చేయాలి. కానీ ప్రస్తుతం రెండేళ్లు పెంచాలనేది ప్రభుత్వం ఆలోచన. ఆ తర్వాత పరిస్థితులను సమీక్షించి మూడేళ్లకు పెంచాలనేదానిపై కసరత్తు చేస్తారట. అదలావుంటే రాష్ట్రంలో పర్యటిస్తున్న 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో మంగళవారం నాడు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. తెలంగాణకు ఆర్థికంగా చేయూత అందించాలని వారిని కోరనున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించే అవకాశమున్నట్లు సమాచారం.