ఎగ్జిబిషన్ ప్రమాదానికి కారణం అది కాదు.. బాధితులకు నష్ట పరిహారం : ఈటల
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని ప్రకటించింది. ఆ మేరకు ఎమ్మెల్యే, ఎగ్జిబిషన్ పాలకమండలి ప్రెసిడెంట్ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. జరిగిన నష్టంపై రెవెన్యూ యంత్రాంగం అంచనా వేస్తోందని, నివేదిక వచ్చాక నష్ట పరిహారం ఏ మేర చెల్లించాలనేది నిర్ణయిస్తామని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరగలేదని ధృవీకరించారు.
మేమంతా ఒకే కుటుంబం
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అగ్నిప్రమాదంపై మాట్లాడిన ఈటల రాజేందర్.. పలు అంశాలపై వివరణ ఇచ్చారు. ఎగ్జిబిషన్ సొసైటీకి మంచి పేరుందని.. ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. ఫైర్ యాక్సిడెంట్ విషయం తెలియగానే సీఎం కేసీఆర్ అందర్నీ అలర్ట్ చేశారని చెప్పారు. ఎవరికి ఏమి జరగకుండా చూడాలని ఆదేశించారని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సొసైటీ సభ్యులతో పాటు ఫైర్ డిపార్టుమెంట్ సిబ్బంది, పోలీసులు, అధికారులు వేగంగా స్పందించడం గొప్ప విషయమన్నారు.
పాలకమండలి, వ్యాపారులు ఒక కుటుంబంలా కలిసి ఉంటున్నామన్నారు ఈటల. ఆ నేపథ్యంలో ఫ్యామిలీలో ఎవరికైనా నష్టం జరిగితే చూస్తూ కూర్చోలేమని.. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపిస్తామన్న ఈటల.. షార్ట్ సర్క్యూట్ కారణం కాదని స్పష్టం చేశారు.
ఎగ్జిబిషన్ బాధితుల ఆవేదన.. సొసైటీపై ఆగ్రహం
టెక్నాలజీ వాడుతాం.. ప్రమాదాలు నివారిస్తాం
ఎగ్జిబిషన్ చరిత్రలో ఇది మొదటిసారని చెప్పిన ఈటల.. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా అత్యాధునిక టెక్నాలజీ వాడతామన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే.. ఆటోమాటిక్గా మంటలు ఆర్పే సిస్టమ్ తీసుకొస్తామన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని.. తద్వారా లభించే ఆదాయం ఆడపిల్లల విద్య కోసం వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎగ్జిబిషన్ నిర్వహణలో ఛారిటీ కోణం ఉన్నందున ఎవరూ రాజకీయం చేయొద్దని కోరారు. అన్ని శాఖల సమన్వయంతో మంటలు తొందరగానే అదుపుచేశామని అన్నారు.
రిపోర్ట్ వచ్చాక నష్ట పరిహారం
ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు ఈటల. ప్రమాదంలో ఎవరెంత నష్టపోయారో అనే దానిపై రెవెన్యూ యంత్రాంగం నివేదిక రూపొందిస్తొందని, అది వచ్చాక నష్టం పరిహారం అందిస్తామని చెప్పారు. ఏ స్టాల్ లో ఎంత స్టాక్ ఉంది, టర్నోవర్ ఎంత తదితర విషయాలు పరిగణనలోకి తీసుకుని పరిహారం అందిస్తామన్నారు. గురువారం, శుక్రవారం ఎగ్జిబిషన్ బంద్ ఉంటుందని.. తిరిగి శనివారం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.