మేడారం మహా జాతరకు 75 కోట్లు విడుదల చేసిన సర్కార్
గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు నిర్వహించాలని సమ్మక్క సారలమ్మల పూజారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. కొండాకోనా పరవశించేలా ,జాతీయస్థాయిలో గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభ మేళాను తలపిస్తుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద విగ్రహాలు లేని విశిష్టమైన సమ్మక్క సారలమ్మల జాతర చాలా ప్రశస్తమైనది. అలాంటి మేడారం జాతర దగ్గర పడుతున్న నేపధ్యంలో ప్రభుత్వం మేడారం జాతర ఏర్పాట్లను చెయ్యటానికి నిధులను విడుదల చేసింది.
రెండేళ్ల కు ఒకసారి జరిగే మేడారం మహా జాతర ఎప్పుడూ విశేషమే. ఈసారి జరగనున్న మహా జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది. గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్దత్తా ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల వారీగా నిధులను కకేటాయించి జాతర ఏర్పాట్లను చెయ్యనున్నారు. తెలంగాణా కుంభమేళా అయిన మేడారం జాతరకు ఎప్పుడూ పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తూనే ఉంటారు. అయితే ఇప్పటికే శాశ్వత ప్రాతిపదికన చాలా ఏర్పాట్లు చేసిన నేపధ్యంలో ఈ సారి కాస్త తక్కువ నిధులను కేటాయించనుంది ప్రభుత్వం.
తాజాగా విడుదల చేసిన 75 కోట్ల రూపాయలలో రహదారుల మరమ్మత్తుల కోసం ఆర్అండ్బీకి రూ.8.5 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీరాజ్ శాఖకు రూ.3.50 కోట్లు, ఇక ఇరిగేషన్కు రూ.4 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ శాఖకు రూ.4 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్కు రూ.19 కోట్లు కేటాయించారు. ఇక అంతే కాదు దేవాదాయ శాఖకు రూ.3 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.4 కోట్లు, డీపీవోకు రూ.3.65 కోట్లు, ఆర్టీసీకి రూ.2.48 కోట్లు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ శాఖకు రూ.11 కోట్లు, రెవెన్యూ విభాగానికి రూ.7.50 కోట్లు, డీటీడీవోకు రూ.55.36 లక్షలు, అగ్నిమాపక శాఖకు రూ.21 లక్షలు, పశుసంవర్థక శాఖకు రూ.21.90 లక్షలు,మత్స్య శాఖకు రూ.17.38 లక్షలు, ఎక్సైజ్శాఖకు రూ.20.49 లక్షలు, పర్యాటక శాఖకు రూ.50 లక్షలు, సమాచార పౌరసంబంధాల శాఖకు రూ.19.15 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖకు రూ.1.46 కోట్లు, అటవీ శాఖకు రూ.1.20 కోట్లు, ఐసీడీఎస్కు 10 లక్షలు కేటాయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మేడారం జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేయడంపై మంత్రి సత్యవతి రాథోడ్ సిఎం కెసిఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మెరుగైన సేవలందించే విధంగా పనులు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రతి పైసా సద్వినియోగం చెయ్యాలని, వృథా ఖర్చులను నివారించాలని ఆమె సూచించారు. త్వరలోనే జాతర ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.సమయం తక్కువగా ఉన్నందున పనులను వేగంగా పూర్తి చేయాలని, అదే సమయంలో నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని సత్యవతి అధికారులను ఆదేశించారు.