పూజారిగా తప్ప ఎందుకూ పనికిరాడు..! ఆయనకు గవర్నర్ పోస్ట్ వేస్ట్ అంటున్న వి.హెచ్..!!
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రశేఖర్ రావు పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు మరోసారి. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కేవలం తిరుపతి పూజారిగానే పనికొస్తాడని సెటైర్లు వేశారు. డాలర్ శేషాద్రి పక్కన గవర్నర్ని పెడితే సెట్ అవుతారని ఎద్దేవాచేశారు. మేం ఏ వినతి ఇచ్చినా గవర్నర్ చెత్తలో పడేస్తున్నారని విమర్శించారు. ఇక అధికార అహంతో చంద్రశేఖర్ రావు కు కళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు. రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం హాజీపూర్ సమస్యను డైవర్ట్ చేస్తోందని ఆరోపించారు.
హాజీపూర్ బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు ఆర్థిక సాయం ప్రకటించలేదన్నారు. ఆ కుటుంబాలను పరామర్శించాలనే కనీస జ్ఞానంలేదని ధ్వజమెత్తారు. బస్సు సౌకర్యం, వంతెన నిర్మించడంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాజీపూర్ బాధిత కుటుంబాలను తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పరామర్శించకపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ బావిలో ధర్నాకు దిగినవారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమయినా ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత కుమారుడు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే చంద్రశేఖర్ రావు పరామర్శించడానికి వెళ్లారనీ, కానీ హాజీవూర్ బాధితులను కలుసుకోవడానికి మాత్రం వెళ్లలేదని వీహెచ్ మండిపడ్డారు.