శభాష్ సతీష్.. ఎస్సైకు గవర్నర్ ప్రశంసలు, నిరుపేద దళితకు ఇంటి నిర్మాణం..
ఈ రోజుల్లో సాయం అంటే ఆమడదూరం వెళ్లే పరిస్థితి. ఇక వేలకు వేలు సాయం.. అదీ కూడా అప్పనంగా అంటే కష్టమే.. కానీ ఓ ఖాకీ ముందుకొచ్చాడు. నిరుపేద దళిత మహిళ పట్ల సానుభూతి చూపించాడు. రూ.80 వేలు ఇచ్చి ప్రశంసలు పొందుతున్నాడు. ఆ మహిళ ఇంటి నిర్మాణం కోసం ఎస్సై చూపిన చొరవను పలువురు కీర్తిస్తున్నారు. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రశంసల్లో ముంచెత్తారు. రూ.80 వేల చెక్కును కూడా అందజేశారు.
పాలకుర్తి ఎస్ఐ సతీష్ను గవర్నర్ తమిళ్ సై అభినందించారు. నిరుపేద వృద్ధ మహిళలకు సొంత ఖర్చులతో ఇంటిని నిర్మించిన ఇచ్చిన సతీష్ను కొనియాడారు. ఎస్ఐ సతీష్కు గవర్నర్ ప్రశంస పత్రాన్ని బుధవారం అందజేశారు. ఎస్ఐను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తదితరులు అభినందించారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్షినారాయణఫురానికి చెందిన బండిపెల్లి రాజమ్మ నిరుపేద వృద్ద దళిత మహిళ. ఈమెకు గూడు లేదు.. ఆమె కష్టాలను చూసిన సతీశ్ ఇళ్లు కట్టించాలని అనుకున్నాడు. ఇంకేముంది ముందుకొచ్చాడు. 1.60 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేయించాడు. ఇందులో సగం రూ.80 వేలు సతీష్ అందజేశారు. తర్వాత సతీష్ చేసిన మంచి పని అందరికీ తెలిసింది. ఇంకేముంది పిలిచి ప్రశంసించారు. అంతేకాదు రాజమ్మకు ఇచ్చిన రూ.80 వేలు కూడా ఇచ్చారు.
తనను గవర్నర్ పిలిచి ప్రశంసించడంపై ఎస్సై సతీష్ ఊహించుకోలేకపోయాడు. ఇదీ తన జీవితంలో మరచిపోలేని రోజు అని చెప్పారు. సతీష్ చేసిన మంచి పని పలువురికి ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ కొనియాడారు.