తెలంగాణా రాష్ట్ర యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ తమిళసై సమీక్షా సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలలో పరిస్థితులపై గవర్నర్ తమిళసై సౌందర రాజన్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు . యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయన్న నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రానికి వచ్చిన నూతన గవర్నర్ సమీక్షా సమావేశం నిర్వహించటంతో అటు విద్యార్ధులలోనూ , అటు యూనివర్సిటీ అధికారులలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే గవర్నర్ తమిళసై తెలంగాణా రాష్ట్ర ప్రజలతో మమేకం అవ్వటానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆమె యూనివర్సిటీలపై దృష్టి సారించటంతో సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావన విద్యార్థులకు కలుగుతుంది.
యూనివర్సిటీలు పరిశోధన కేంద్రాలుగా , విజ్ఞాన భాండాగారాలుగా పని చెయ్యాల్సిన చోట రాజకీయాలకు అడ్డాలుగా మారుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. ఇక అధికారుల తీరు కూడా అలాగే ఉంది. యూనివర్సిటీ అధికారులు పట్టింపు లేని తనం, అధ్యాపకుల నిర్లక్ష్య ధోరణి వెరసి తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇక తాజాగా తెలంగాణ గవర్నర్ గా తమిళ సై సౌందరరాజన్ బాధ్యతలు చేపట్టడంతో ఆమె తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల సమస్యల పైన దృష్టి సారిస్తున్నారు.
ప్రస్తుతం వర్సిటీల్లో వీసీల నియామకం, ఖాళీల భర్తీ తదితర అంశాలపై గవర్నర్ తమిళిసై నేడు సమీక్ష నిర్వహిస్తున్నారు . ఈ సమావేశానికి ఇంచార్జి వీసీలు, రిజిస్ట్రార్లు, అధికారులు హాజరయ్యారు . గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చాన్సలర్ హోదాలో తమిళిసై తొలిసారిగా వర్సిటీలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వీసీలతో గవర్నర్ తమిళిసై సమావేశం జరుగుతుంది .యూనివర్సిటీల పరిస్థితిపై గవర్నర్ తమిళిసై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
యూనివర్సిటీల్లో కోర్సులు, అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులు గవర్నర్ కు తెలిపారు. బయోమెట్రిక్ విధానం మరియు అకడమిక్ క్యాలెండర్ పై కూడా ఆమె అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక యూనివర్సిటీలకు చాన్సలర్ హోదాలో ఆమె కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుందని సమాచారం .