కేసీఆర్ సర్కార్పై తమిళి సై గుర్రు.. కరోనా నియంత్రణ చర్యలపై అసంతృప్తి..
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై అసహనం వ్యక్తం చేశారు. తాను స్వయంగా లేఖలు రాసినా.. ప్రభుత్వం ఖాతరు చేయలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
కరోనా వైరస్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించలేదని గవర్నర్ మండిపడ్డారు. వైరస్ ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని మండిపడ్డారు. అధిక సంఖ్యలో టెస్టులు చేయడమే పరిష్కార మార్గమని సూచించారు. మొబైల్ టెస్టింగ్లు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరానని తమిళిసై గుర్తుచేశారు. కరోనా తీవ్రతపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తు ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించ లేదని మండిపడ్డారు.
ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే టెస్టులు చేస్తున్నామని చెప్పి తప్పించుకుంటుందని తమిళిసై తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేక బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని గుర్తుచేశారు. కరోనా వైరస్ చికిత్స ప్రభుత్వానికి భారంగా మారిందని వివరించారు. కానీ పైకి మాత్రం అన్నీ వసతులు సమకూర్చామని చెబుతోందన్నారు.
కానీ వాస్తవం మరోలా ఉందని... రోగులు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. దీంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటో అర్థమవుతోందన్నారు. తనతో సీఎం కేసీఆర్ సమావేశమైన సందర్భంలో చెప్పానని.. కానీ ఆయన వినిపించుకోలేదని ధ్వజమెత్తారు.