గౌరెల్లి భూ వివాదం: 9 ఎకరాలే కొనుగోలు, కౌలుదారుడి వద్ద కొనుగోలు, ఆరోపణలపై హరివర్ధన్రెడ్డి
గౌరెల్లి భూములు ఎవరివీ..? కౌలుదారులకే చెందుతావా ? పట్టాదారుల సొంతమా ? బాచారం గ్రామ పరిధిలో ఉన్న 412 ఎకరాల భూమి రైతుల వద్దే ఉందా ? కౌలు చేసే వారి వద్ద ఉందా ..? లేదంటే రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నాయా..? ఇప్పడీ ప్రశ్నలు గౌరెల్లి కాదు.. సామాన్యుడి మదిలో కూడా మెదలుతున్నాయి. ఇంతలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిపై ఆరోపణలు వస్తోన్నాయి. ఆ భూమిని కొనుగోలు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాల విమర్శలను హరివర్ధన్ రెడ్డి కొట్టిపారేశారు. రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని ఆరోపించారు.
భూమి ఉన్నది నిజమే.
గౌరెల్లిలో తనకు 9 ఎకరాల భూమి ఉన్న మాట వాస్తవమేనని సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అంగీకరించారు. తాను భూమిని కౌలు రైతుల వద్ద కొనుగోలు చేసినట్టు వివరించారు. ఆ భూమిపై కౌలురైతులకు యాజమాన్య హక్కు ఇచ్చిన తర్వాత కొనుగోలు చేశానని తెలిపారు. కానీ ఇప్పుడు టెనెంట్, యజమాని మధ్య గొడవ జరుగుతుందని వివరించారు. కానీ కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని.. ఇది సరికాదని హితవు పలికారు.
రైతులు అమ్మేశారు
బాచారంలో రైతులను బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 412 ఎకరాల భూమి రాజకీయ నేతల కబంధ హస్తాల్లో ఉందని ప్రచారం జరుగుతుంది. దీనిపై హరివర్దన్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనకు మాత్రం 9 ఎకరాల భూమి ఉందని వివరించారు. అదీ కూడా టెనెంట్ వద్ద కొనుగోలు చేశానని చెప్పారు. రిజిష్ట్రేషన్ కోసం ఎందుకు అడగడం లేదంటే.. వివాదాస్పద భూమి అని.. గొడవలు జరుగుతున్నందున మిన్నకుండిపోయానని చెప్పారు. డబ్బులు పెట్టి కొనుగోలు చేసి.. ఎందుకు స్తబ్ధుగా ఉన్నారనే ప్రశ్న మాత్రం అనుమానాలకు తావిస్తోంది.
412 ఎకరాల భూమి.. 48 మంది రైతులు కాదట..
వాస్తవానికి 412 ఎకరాల భూమి రైతుల చేతుల్లో లేదని హరివర్దన్ రెడ్డి తెలిపారు. రైతులు అమ్మేశారని.. ఇప్పుడు కొందరి పేర్లతో ఉందని చెప్పారు. కానీ 48 మంది రైతులని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరివర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడెవరు రైతులు లేరని చెప్పారు. హరివర్ధన్ రెడ్డి, ఆయన అనుచరుల పేరుతో ఎకరాల భూమి ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు.
అమ్ముకొని పనిచేశా..?
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి భూములు అమ్ముకొని పనిచేశానని హరివర్ధన్ రెడ్డి తెలిపారు. చట్టపరంగా, న్యాయపరంగా వెళతానని చెప్పారు. కౌలురైతులకు యాజమాన్య హక్కు ఇచ్చాకే కొనుగోలు చేశానని.. తర్వాతనే వివాదం చెలరేగిందని చెప్పారు. అధికారులపై ఒత్తిడి చేయలేదని.. కోర్టులు కూడా ఉన్నాయని.. ప్రెషర్ చేస్తే పనికాదని హరివర్ధన్ రెడ్డి తెలిపారు. తమ భూమిపై రెవెన్యూ చట్టం ఏం చెబితే అదే చేస్తామని స్పష్టంచేశారు.
పగవాళ్లు కూడా మంచే చెప్తారు..?
తానంటే ఏంటో అందరికీ తెలుసునని హరివర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తన గురించి పగవాళ్లు కూడా మంచిగానే చెబుతారన్నారు. తనకు గౌరెల్లిలో ఉన్నది 9 ఎకరాల భూమి మాత్రమేనని స్పష్టంచేశారు. దానిపై చట్టం, న్యాయం, ఏం చెబితే అలా నడుచుకుంటానని చెప్పారు. రాజకీయ అండదండలను ఉపయోగించబోనని.. అలా ఎప్పుడూ పనులు చేసుకోలేదని స్పష్టంచేశారు.