ఈ పైత్యం ఏంటో?: నర్సరీ విద్యార్థులకూ గ్రేడ్స్ ఇచ్చేశారు!
హైదరాబాద్: విద్యా వ్యవస్థలో పోటీ అంతకంతకు శృతి మించిపోతోంది. ర్యాంకుల కోసం పిల్లలను నిరంతరం చదివిస్తూ వారి మానసిక ఆందోళనకు కారణమవుతున్న విద్యా సంస్థలు.. పలుమార్లు వారి ప్రాణాలను కూడా తీస్తున్నాయి. విద్యా సంస్థల యాజమాన్యాలు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే అనేక మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయినా విద్యా సంస్థల్లో మార్పు రాకపోవడం శోచనీయం.
ఇది ఇలా ఉంటే, హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల అత్యుత్సాహం ప్రదర్శించింది. నర్సరీ విద్యార్థులకు ఏకంగా గ్రేడ్స్ ప్రకటించింది. నర్సరీలో 10 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు, వారిలో ఇద్దరికి పదికి పది పాయింట్లు వచ్చాయి. ఎల్కేజీలో 14 మంది, యూకేజీలో 11 మంది, ఒకటో తరగతిలో 9మంది మొదటి శ్రేణిలో పాసయ్యారు.
అక్కడితో ఆగకుండా ఏకంగా ఆ విద్యార్థుల పేర్లను ఫొటోలతో సహా బిల్ బోర్డులో కూడా ఎక్కించారు. నర్సరీ నుంచి ఒకటో తరగతి వరకు ఉత్తీర్ణులైన వారంటూ ఓ పెద్ద బిల్ బోర్డు పెట్టింది నగరంలోని ప్రియభారతి అనే ప్రైవేట్ స్కూల్. అయితే, ఆ బోర్డును ఒకతను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు తమదైన శైలిలో సదరు పాఠశాలపై సెటైర్లు వేస్తున్నారు.
నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు కూడా గ్రేడ్ లేంట్రా బాబూ.. అంటూ మండిపడుతున్నారు. వేగంగా పాలు తాగడం, నిద్రపోవడంలో టాపర్లా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంత చిన్న పిలల్లో కూడా పోటీ తత్వం పెంచి వారిని ఆందోళన గురిచేస్తారా? అంటూ మండిపడుతున్నారు.