గ్రేటర్ ఎన్నికల వేళ ... మీ సేవా కేంద్రాల వద్ద జనజాతర .. కారణం ఇదే !!
హైదరాబాద్ మహా నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు , వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. వరదల సమయంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అయితే చాలాచోట్ల సాయం అందలేదని, ప్రజాప్రతినిధులు వరద సహాయాన్ని కొంతమందికే అందించారని బాధితులు ఆందోళన చేసిన క్రమంలో, వరద సహాయం అందని వారంతా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. వారి దరఖాస్తులను పరిశీలించి వరద సహాయాన్ని అందరికీ అందిస్తామని స్పష్టం చేసింది.
గ్రేటర్ వార్: బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న కాంగ్రెస్..అసలేం జరుగుతోంది ?
గ్రేటర్ లో వరద సహాయం కోసం మీసేవా కేంద్రాల వద్ద క్యూ
గ్రేటర్ హైదరాబాద్ లో వరద సహాయం కోసం, అందని బాధితులు గత రెండు రోజులుగా మీసేవ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం 4 గంటల నుండే మీ సేవ కేంద్రాల వద్దకు మహిళలు, వృద్ధులు భారీగా తరలివచ్చి పరిహారం కోసం తమ పేర్లను నమోదు చేసుకోవడానికి క్యూలైన్లలో నిల్చున్నారు. హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురం, ఎల్బీనగర్ ,శేరిలింగంపల్లి , సికింద్రాబాద్ సీతాఫల్ మండి, సనత్ నగర్ , చందానగర్ , మారేడ్ పల్లి , కూకట్పల్లి , అంబర్ పేట గోల్నాక మీ సేవ కేంద్రాల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవడం కోసం పడిగాపులు పడుతున్నారు.
సాయం అందని వారికి దరఖాస్తుకు అవకాశం .. ఆశగా అప్లై చేస్తున్న జనం
మీసేవ కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న మరుసటి రోజునే నగదు వారి ఖాతాలో జమ అవుతుందన్న సమాచారంతో బాధితులు పెద్ద సంఖ్యలో వరద సహాయం కోసం బారులు తీరారు. డిసెంబర్ 1న జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా ఉండటంతో వరద సహాయం తప్పకుండా అందుతుందని గంపెడు ఆశతో మీ సేవ కేంద్రాల వద్ద తమ పేర్లను నమోదుకు క్యూ కట్టారు. మరోపక్క అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు గ్రేటర్ హైదరాబాద్ లో వరదలు ముంచెత్తడంతో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంది.
ఎన్నికల సమయంలో వరద సాయం ... ఏ మేరకు వర్కవుట్ అవుతుందో !!
ఆ వ్యతిరేకతను సానుకూలతగా మార్చుకోవడం కోసం తక్షణ వరద సహాయాన్ని అందించి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ స్పష్టం చేసింది. ఇదే సమయంలో వరద సహాయం అందని వారికి కూడా, మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే పది వేల రూపాయల వరకు సహాయాన్ని అందించి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఏది ఏమైనా జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న వరద సాయం ఈ ఎన్నికల్లో ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.