గ్రేటర్ ఎన్నికలపై గులాబీబాస్ గురి... కేటీఆర్ రోడ్ షోలు , ఫైనల్ టచ్ గా కేసీఆర్ ఒకే ఒక్క ప్రచార సభ !!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు సీఎం కేసీఆర్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదని నిర్ణయించుకున్న కేసీఆర్ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలను ఎన్నికల ప్రచార బరిలోకి దింపారు . మరోవైపు కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వారం రోజుల పాటు కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఫైనల్ టచ్ గా సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ వార్ ... రంగంలోకి దిగిన కవిత ... కాంగ్రెస్ , బీజేపీలకు ఆ హక్కు లేదంటూ ఫైర్
గ్రేటర్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫోకస్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగటంతో ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగా ఎన్నికల ప్రచార బరిలోకి దిగింది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, కేసీఆర్ తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ కూడా దుబ్బాక ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు అంటూ, గ్రేటర్ లో గులాబీ జెండా ఎగరాలి అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాలోనూ ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ శ్రేణులకు తెలిపారు.
ఎల్బీ స్టేడియం లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించే అవకాశం
గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం కేసీఆర్ పాల్గొనడానికి రెడీ అయ్యారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని చెప్పిన కేసీఆర్ నగరం నడిబొడ్డున భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు.
ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిజెపి ఎదుగుతున్న క్రమంలో, అటు బిజెపి ఇటు కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడానికి సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగుతున్న తీరు ఆసక్తికరంగా మారింది.
ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టటానికి రంగంలోకి గులాబీ బాస్
భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా ప్రచారం చేసి, బిజెపి ,కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా సన్నాహాలు చేస్తున్నారు.
ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా... మతకల్లోలాలతో కొట్టుకు చచ్చే హైదరాబాద్ కావాలా అంటూ సీఎం కేసీఆర్ ప్రచార పర్వాన్ని కొనసాగించనున్నట్లు సమాచారం. తమ హయాంలో చేసిన అభివృద్ధి , భవిష్యత్ లో చెయ్యబోయే అభివృద్ధి, కరోనా సమయంలో, వరదల సమయంలో ప్రభుత్వం అందించిన సహాయం ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలని భావిస్తున్నారు .
ఎన్నికల ప్రచారం చివరలో కేసీఆర్ భారీ బహిరంగ సభ .. ఒకే ఒక్క సభతో ప్రభావం ఉంటుందా ?
ఈ నెల 21వ తేదీ, లేదా 22వ తేదీన కేటీఆర్ రోడ్ షో లు ప్రారంభిస్తే ఈనెల 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్న నేపథ్యంలో 28వ తేదీన కానీ 29వ తేదీన ఉదయం కానీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్న భావనకు వచ్చిన సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రచార పర్వాన్ని వ్యూహాత్మకంగా సాగిస్తున్నారు. ఒకే ఒక్క భారీ బహిరంగ సభతో ఆయన తన ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇక కేసీఆర్ సభ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి .