డ్యామిడ్...టీఆర్ఎస్ పార్టీ కథ అడ్డం తిరిగింది.. గ్రేటర్ ఎన్నికల టైమ్ లో వరదలు
ఎన్నికలు ఏవైనా సరే విజయం మాత్రం టిఆర్ఎస్ పార్టీదే అని చెప్పుకుంటున్న అధికార పార్టీ నేతలకు భారీ వర్షాలు షాక్ ఇచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన వరదలు అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ లోను గులాబీ జెండా రెపరెపలాడుతుంది అని భావించిన గులాబీ నేతలు తాజా వర్షాలతో హైదరాబాద్ నగరం ముంపుకు గురి కావడంతో డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది అని లబోదిబోమంటున్నారు.
భాగ్యనగరాన్ని ముంచెత్తిన వరదలు .. రంగంలోకి మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. వేలాది కాలనీలు ముంపుకు గురయ్యాయి. మౌలిక వసతులు కూడా లభించని పరిస్థితిలో పలు కాలనీలు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలపై, జీహెచ్ఎంసీ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భాగ్యనగరాన్ని వరదలు ముంచెత్తడంతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
సహాయక చర్యలపై ప్రజల అసంతృప్తి
కార్పొరేటర్లు సైతం రంగంలోకి దిగి ప్రజలకు అండగా నిలవాలని చెప్పారు. ఇక మంత్రులు ,ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల పరిధిలో ప్రజలకు సహాయం చేయాలని సూచించారు. అయితే హైదరాబాద్ ఊహించని విధంగా ముంపుకు గురి కావడంతో, ఇంకా వర్షాలు పడుతున్న క్రమంలో అధికారులకు సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందిగా మారింది. వేల సంఖ్యలో కాలనీలు ముంపుకు గురి కావడంతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువగా మారింది. సమస్యలు పరిష్కరించడానికి తగిన సిబ్బంది లేకపోవడం, మరో పక్క వర్షం కురుస్తున్న క్రమంలో అధికారుల సహాయక చర్యలు సరిపోవడం లేదు.
మంత్రులు, ఎమ్మెల్యేలు , కార్పొరేటర్ లకు చేదు అనుభవం .. నిలదీస్తున్న స్థానికులు
ఇదే క్రమంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిన్నటికి నిన్న ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తన నియోజకవర్గంలో ముంపుకు గురైన ప్రాంతాలలో బోటులో పర్యటిస్తే మహిళలు గట్టిగా నిలదీశారు. మూడు రోజుల నుంచి నీళ్లు ,భోజనం లేక నరకం చూస్తున్నామని, ఇప్పుడొచ్చి ఎలా ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామంటూ మండిపడ్డారు.
మునిగిపోయిన హైదరాబాద్ .. ఇదేనా బంగారు తెలంగాణా అంటూ ప్రశ్న
ఇక టిఆర్ఎస్ పార్టీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా కార్పొరేటర్ ల నుండి చేదు అనుభవం ఎదురైంది. ఇక కార్పొరేటర్లకు ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలు కనిపిస్తేచాలు ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఓట్లేసి అధికారాన్ని కట్టబెడితే మీరు చేసింది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా మీ బంగారు తెలంగాణ అంటూ నిలదీస్తున్నారు. కేవలం అధికారం కోసమే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
ప్రజల నిరసనలతో తల పట్టుకుంటున్న టీఆర్ఎస్ నేతలు
సాక్షాత్తు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినా ప్రజల్లో అసహనం ఏమాత్రం తగ్గలేదు.
మొన్నటి వరకూ ప్రజలంతా పాజిటివ్ గా ఉన్నారు అనుకుంటే, ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చిన వరదల కారణంగా మొత్తం వ్యవస్థ నెగిటివ్ గా మారుతుందని అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో భారీ వర్షాలు వరదల కారణంగా కాలనీల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారే అవకాశం లేకపోలేదు. ఇది అధికార పార్టీకి పెద్ద చిక్కు తెచ్చి పెట్టేలా ఉంది .
Recommended Video
అధికార పార్టీని బోల్తా కొట్టించిన వరదలు .. ఎన్నికలపై వరదల ఎఫెక్ట్ !!
గత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కంటే ఈసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేసిన టిఆర్ఎస్ పార్టీని భారీ వరదలు బోల్తా కొట్టించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు , కార్పోరేటర్లకు ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది .ఈ సమయంలో వెంటనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తే, ఎన్నికల మీద ఈ వరదల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.