వరదసాయం కోసం మళ్లీ క్యూ.. మీ సేవా కేంద్రాల బారులుతీరిన జనం, సీఎం ఇలా, కమిషనర్ అలా..
గ్రేటర్ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికే చెప్పినట్టు వరదసాయం మళ్లీ మొదలైంది. రూ.10 వేల సాయం కోసం జనం మళ్లీ క్యూ కట్టారు. ఎన్నికలు ముగిసిన వెంటనే సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా.. అందజేయనున్నారు. సోమవారం నుంచి వరద సాయం చేస్తామని ఆదివారం ప్రభుత్వం ప్రకటించగా.. ఇవాళ్టితో మీ సేవా కేంద్రాలకు జనం బారులుతీరారు. చంపాపేట మీ సేవా కేంద్రం వద్ద జనం బారులుతీరారు.
వరద సాయం కోసం బాధితులు సీఎం క్యాంప్ ఆఫీస్కు సమీపంలోని మీ సేవ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. బాధితులను పోలీసులు చెదరగొట్టారు. లాక్ డౌన్ లో ఏ విధంగా అయితే పరిహారం ఇచ్చారో అదేవిధంగా 10 వేలు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. సెకండ్ ఫ్లోర్ ఉన్న వారికి వరద సహాయం చేశారు. నిజమైన బాధితులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం మూడు గంటల నుంచి మీ సేవ వద్ద పడిగాపులు పడుతున్నారు.
Recommended Video
వరద సాయానికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు రావొద్దని సూచించారు. అర్హులను గుర్తించి వరదసాయం అందిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని చెప్పారు. వరదసాయం అందని వారి వివరాలను అధికారులు సేకరిస్తారని చెప్పారు. బాధితుల బ్యాంకు ఖాతాలో వరదసాయం డబ్బులు జమ చేస్తామని లోకేష్ కుమార్ తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రకటన ఒకలా ఉండగా.. గ్రేటర్ కమిషనర్ మరొలా ప్రకటించారు. దీంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. మీ సేవా కేంద్రాలకు వెళ్లాలా.. లేదంటే అధికారులు వస్తారా అని అడుగుతున్నారు. కానీ తమ ఇళ్లకు అధికారులు ఎప్పుడూ వస్తారని.. అందుకు సమయం పడుతోందని లబోదిబో మంటున్నారు.