గ్రేటర్ వార్ .. అందరి దృష్టి వారిపైనే .. ఫలితం నిర్ణయించేది ముంపు బాధితులే!!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను మించిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తమ ఖాతాలో వేసుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు యుద్ధ ప్రాతిపదికన ప్రచారం చేస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఆరేళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రచారం చేస్తూ, కరోనా, వరదల సమయంలో అధికార పార్టీగా ప్రజలకు అండగా నిలిచామని చెబుతూ, వరద సహాయం కూడా అందించామని గుర్తు చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకు పడుతుంది.ఇక కాంగ్రెస్ పార్టీ నో టిఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ , వరదలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంటూ టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ప్రచారం చేస్తుంది. బిజెపి కూడా ప్రధానంగా వరదబాధితుల పై దృష్టిపెట్టి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తుంది.
Recommended Video
నన్ను టీఆర్ఎస్ నేతలే గెలిపించారు : గ్రేటర్ ఎన్నికల సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే సంచలనం
ముంపు బాధితులను ఆధుకున్నామన్న ధీమాలో గులాబీ నేతలు
గత ఎన్నికల్లో బల్దియాలో 150 డివిజన్లలో 99 స్థానాలను గెలుచుకొని టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసింది.ఈసారి కూడా వందకు పైగా స్థానాలను గెలుచుకొని గ్రేటర్ మేయర్ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు ,వరదలు టిఆర్ఎస్ పార్టీకి నష్టం చేయకుండా పదివేల రూపాయల వరద పరిహారాన్ని అందించామని, అలాగే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని బాధితులకు అండగా ఉండడం కోసం సీఎం కేసీఆర్ 550 కోట్ల రూపాయల పరిహారాన్ని మంజూరు చేశారని టిఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ప్రజలలో టిఆర్ఎస్ పార్టీ పట్ల ఎలాంటి విముఖత లేదు అని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు కూడా తమకే ఓట్లు వేస్తారు అన్న ధీమా లో టిఆర్ఎస్ పార్టీ ఉంది.
ముంపు బాధితుల ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని బీజేపీ
ఇక బిజెపి వరద ముంపు బారిన పడిన ప్రజలు తమ వైపే ఉంటారని, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని, దుబ్బాక ఎన్నికల ఫలితం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని ధీమాతో ఉంది. పాతబస్తీని భాగ్యనగరంగా మారుస్తామని , వందమంది కార్పొరేటర్లను గెలిచి గ్రేటర్ లో కాషాయ జెండా ఎగర వేస్తామని , ఎల్ ఆర్ ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ ఓడిపోవాలని బీజేపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హైదరాబాద్ ను కేసీఆర్ నుంచి మజ్లిస్ పార్టీ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ముంపు బాధితులు వరద సమయంలో ప్రభుత్వ తీరును గుర్తు చేసుకుని ఓట్లు వేయాలని కోరుతున్నారు.
హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే అంటూ కాంగ్రెస్
ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తామేనని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఇక కరోనా ఇబ్బందులతో ఉన్న ప్రజలను ఎల్ ఆర్ ఎస్ పేరుతో కష్టాలపాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఎల్ ఆర్ ఎస్ రద్దు చేస్తామంటూ చెప్తున్నారు. నో టిఆర్ఎస్, నో ఎల్ ఆర్ ఎస్ అని ప్రచారం చేస్తున్నారు. ముంపు బాధితులు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అన్న ఆశాభావం లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.
ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది ముంపు బాధితులే .. వారి మొగ్గు ఎటు వైపో !!
ఏదేమైనప్పటికీ జిహెచ్ఎంసి ఎన్నికలలో నగరంలో సగానికిపైగా కాలనీలు నీట మునిగి, ముంపుకు గురి కావడంతో ముంపు బాధితులే రాజకీయ పార్టీలకు ప్రధానమైన టార్గెట్ గా మారారు . వరద బాధితులు అయిన ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపితే వారికి విజయం వరించే అవకాశం ఉన్న కారణంగా రాజకీయ పార్టీలు ముంపు బాధితులపై దృష్టి సారించాయి. మరి ఈ సమయంలో వరద ముంపు బారిన పడిన గ్రేటర్ వాసులు ఏ పార్టీకి తమ మద్దతును ప్రకటిస్తారో వేచి చూడాలి.