గ్రేటర్ లో ప్రలోభాల పర్వం .. గంపగుత్తగా ఓట్ల కోసం.. రహస్య సమావేశాలు, తాయిలాలు
జిహెచ్ఎంసి ఎన్నికలకు ప్రచార పర్వం జోరుగా కొనసాగుతోంది. ప్రచారానికి గడువు తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టడమే కాకుండా, పక్కా ప్లాన్ తో గంపగుత్తగా ఓట్లు కొనుగోలుకు ప్రలోభాల పర్వానికి తెర తీసినట్లుగా తెలుస్తోంది. సహజంగా ఎన్నికలకు కనీసం 25 రోజుల నుంచి 40 రోజుల వరకు సమయం ఉండేది. అయితే ఈసారి గ్రేటర్ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థుల ప్రచార పర్వాన్ని నిర్వహించడంతోపాటుగా, ప్రలోభాలకు తెరతీశారు.
గ్రేటర్ వార్ .. అందరి దృష్టి వారిపైనే .. ఫలితం నిర్ణయించేది ముంపు బాధితులే!!
సంఘాల వారీగా ఓట్లను కొల్లగొట్టే యత్నం .. ప్రలోభాలు , తాయిలాలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒక్కో డివిజన్లో 40 వేల నుండి 80 వేల వరకు ఓటర్లు ఉంటారు. 3 నుంచి 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బస్తీ లలో , కాలనీలలో ఇంత తక్కువ సమయంలో ప్రచారం నిర్వహించడం అభ్యర్థులకు కత్తిమీదసామే. ఈ నేపథ్యంలో అందరు ఓటర్లను కలిసే అవకాశం లేకపోవడంతో, కాలనీ కమిటీలు, బస్తీ సంక్షేమ సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు , కుల సంఘాల వారీగా ఓట్లను కొల్లగొట్టడానికి ప్రలోభాలకు తెర తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
కుల సంఘాలు, మహిళా సంఘాలు, కాలనీ కమిటీలు టార్గెట్ గా రహస్య భేటీలు
సంఘాల ప్రతినిధులతో రహస్యంగా సమావేశాలు నిర్వహించి ఓట్లు గంపగుత్తగా తమకే పడాలి అంటూ కోరటమే కాకుండా, వారికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చడం కూడా జరుగుతున్నట్లుగా సమాచారం. ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో కుటుంబ సభ్యులను కూడా రంగంలోకి దించి డివిజన్లోని ఏరియాల వారీగా ప్రణాళికాబద్ధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే పార్టీ వీక్ గా ఉందని భావిస్తున్నారో అక్కడ అగ్ర నాయకుల ప్రచారాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలింగ్ కు సమయం లేకపోవటంతో ఓటర్ల తాయిలాలకు రంగం సిద్ధం
ప్రత్యర్ధి పార్టీల విమర్శలను తిప్పి కొట్టటం తో పాటుగా, తమను గెలిపిస్తే ఏం చేస్తామన్న దానిపై ప్రాంతాలవారీగా సమస్యలను దృష్టిలో పెట్టుకొని హామీల జల్లు కురిపిస్తున్నారు. పోలింగ్ కు పెద్దగా సమయం లేకపోవడంతో ఇప్పటి నుండే ఓటర్లకు తాయిలాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న అభ్యర్థులు ఇప్పటి నుండే తన ప్రభావం మొదలుపెట్టారు. ఖర్చుకు వెనకాడకుండా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు.
Recommended Video
కొనసాగనున్న ధన ప్రవాహం .. ఓటర్లను తమవైపు తిప్పుకునే యత్నం
కొత్త వ్యూహాలను రచిస్తూ అన్ని రకాలుగా ఓటర్లకు ఎర వేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా ప్రలోభాలకు గురికాకుండా, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎక్కడైనా డబ్బులుపంచడం, మద్యం బాటిల్స్ అందించడం వంటి చర్యలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని ఎన్నికల సంఘం కోరుతుంది . ఒకపక్క ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్స్ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ, రాజకీయ పార్టీల నేతలు మాత్రం తమ పని తాము చేసుకుపోతూనే ఉంటారు. ప్రలోభాల పర్వంలో ఓటర్లను తమవైపుకు తిప్పుకునే యత్నం చేస్తున్నారు .