నగరంలో మళ్లీ పెరుగుతున్న క్రైం..! వరుస కిడ్నాపులతో కలకలం..!!
హైదరాబాద్: ప్రశాంతంగా ఉండే భాగ్యనగరంలో మళ్లీ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో క్రైం రేట్ చాలా తగ్గిందని పోలీసులు లెక్కలు చెప్తున్నప్పటికి నేరాలు మళ్లి పెరిగిపోతున్నట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. దొంగతనాలు, అఘాయిత్యాలు, హత్యలే కాకుండా కిడ్నాప్ లతో భాగ్యనగరాన్ని హడలెత్తిస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవల చిన్న పిల్లల దగ్గర నుండి పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి ఆతర్వాత పైశాచింకంగా హత్య చేస్తున్నారు దుండగులు. నగరంలో ఇలాంటి ముఠా అటు పోలీసులకు, ఇటు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ప్రశాంతంగా ఉండే నగరం..! కిడ్నాప్ లతో ఉలిక్కి పడుతున్న భాగ్యనగరం..!!
భాగ్యనగరాన్ని అదృశ్య భయం వెంటాడుతోంది. కోటికి చేరువైన జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో మనుషులు కనిపించకుండా పోతున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. ఆకర్షణ మాయలో పడి యువతరం గువ్వ పిట్టల్లా ఎగిరిపోతుండగా.. ఆదరణ కరవై పెద్దతరం గడప దాటేస్తోంది. మూడు కమిషనరేట్ల పరిధిలో ఈనెల మొదటి నాలుగు రోజుల్లోనే 77 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న ఇలాంటి ఉదంతాల్లో ఇవి సగం కావడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి.
హైదరాబాద్ పరిదిలో 77 మిస్పింగ్ కేసులు..! భయపడుతున్న పగర వాసులు.!!
ఈ నెలలో తొలి నాలుగు రోజుల్లో హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ లలో 77 మిస్సింగ్ కేసులు రిజిస్టర్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. వీరిలో అత్యధికులు వయసులో ఉన్న అమ్మాయిలే కావడం గమనార్హం. 1వ తేదీన హైదరాబాద్ పరిధిలో 13, సైబరాబాద్ పరిధిలో 8, రాచకొండ పరిధిలో 10 కేసులు నమోదుకాగా, 2వ తేదీన 10, 14, 7, మూడున 1, 1, 2, నాలుగున 5, 2, 4 కేసులు నమోదయ్యాయి.
ప్రేమ పేరుతో కిడ్నాపులు..! పెరిగిపోతున్న నేర ప్రవ్రుత్తి..!!
ఆకర్షణ, ప్రేమ మాయలో పడుతున్న అమ్మాయిల కేసులు వీటిల్లో అత్యధికంగా ఉన్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చిన ఉత్తరాది యువకులే అత్యధిక కేసుల్లో నిందితులుగా ఉంటున్నారని అంటున్నాయి. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అమ్మాయిలు, తమంతట తాముగా గడప దాటుతున్నారని తమ విచారణలో తేలుతోందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్న అదృశ్యం ఉదంతాల్లో ప్రియుడితో పరారైన.. కేసులే అధికం.
పోలీసులకు సవాల్ గా మారిన కిడ్నాపులు..! కట్టడి చేస్తామంటున్న సీసీఎస్ అదికారులు..!!
ఠాణాలకు వచ్చే ఫిర్యాదుల్ని బట్టి 90 శాతానికిపైగా ఇవే ఉంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా కొందరు మహిళలు ఇదే కారణంతో అదృశ్యమవుతున్నారు. అత్తింట్లో ఆదరణ లేకపోవడం.. కోరుకున్న అనురాగం భర్త నుంచి లభించకపోవడం.. ఈ విషయాలపై పుట్టింట్లో చెబితే సర్దిచెప్పే ప్రయత్నం చేయడం.. తదితర అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారానో లేక నేరుగానో పరిచయమయ్యే యువకులు సాంత్వనగా మాట్లాడితే వివాహితలు ఆకర్షితులవుతూ ఇంటిని వీడుతున్నారు. మరికొందరు మాత్రం అత్తింట్లో హింసను భరించలేక దూరంగా బతుకుదామని పారిపోతున్నారు.