వైయస్ షర్మిల కేసు, ప్రకాశం జిల్లా ఎంసీఏ విద్యార్థి అరెస్ట్: నిందితుడ్ని ఎలా గుర్తించారంటే?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మి పైన సోషల్ మీడియాలో జరిగిన అభ్యంతరకర వ్యాఖ్యల కేసుకు సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.
పోలీసులు అరెస్ట్ చేశారు
ప్రకాశం జిల్లా చోడవరంకు చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్ను అరెస్ట్ చేశారు. వెంకటేశ్ గుంటూరులోని ఓ ప్రయివేటు కాలేజీలో పీజీ విద్యార్థి అని పోలీసుల విచారణలో తేలింది. అతను ఎంసీఏ చదువుతున్నాడు. నిందితుడిపై ఐపీసీ 509, ఐటీ చట్టం 67 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇతనితో పాటు మంచిర్యాలకు చెందిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.
గూగుల్ నుంచి సాయం తీసుకొని
సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారంటూ కొద్ది రోజుల క్రితం వైయస్ షర్మిల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు గూగుల్ ప్రతినిధుల సాయాన్ని తీసుకున్నారు. గూగుల్ ప్రతినిధులు ఇచ్చిన ఐపీ సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అసలు సూత్రధారుల పాత్రపై విచారణ జరిపేందుకు వీరి కస్టడీని పోలీసులు కోరనున్నారు.
కలత చెందిన షర్మిల ఫిర్యాదు
షర్మిలపై దుష్ప్రచారం కేసులో పోలీసులు పలు యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. షర్మిల, ప్రభాస్ మధ్య సంబంధం ఉందంటూ 2014 ఎన్నికలకు ముందు దుష్ప్రచారం జరిగింది. ఇటీవల మరోసారి ప్రచారం ప్రారంభమైంది. దీనిపై కలత చెందిన షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు.