రద్దీ రోడ్ పై డర్టీ హరీ హాఫ్ న్యూడ్ పోస్టర్: ప్రమాదాలకు ఛాన్స్...పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాదు: ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు ఎక్కువగా బోల్డ్ అడల్ట్ కంటెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాయి. ఇక కొత్త కథలకు కరువు వచ్చినట్లుగా సినిమాలు మరీ శృతి మించిపోతున్నాయి. అడల్ట్ కంటెంట్ కాన్సెప్ట్ తీసుకుని కొంత క్రైమ్ టచ్ ఇచ్చి సినిమాను పూర్తి చేస్తున్నారు. ఇక లాక్డౌన్ సమయంలో సినిమా థియేటర్లకు మూత పడటంతో ఓటీటీ ప్లాట్ఫాం పైనే చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎక్కువగా సాఫ్ట్ పోర్న్ సినిమాలే ఉన్నాయి.
పేరుకు రొమాంటిక్ సినిమా అని చెబుతున్నప్పటికీ ఆ రొమాన్స్ స్థాయిని మించి ఏకంగా ఓ చిన్న పోర్న్ సినిమానే తలపిస్తున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్పై విడుదలవుతున్న కారణంగా ఇంట్లో పిల్లలు కూడా వీటిని చూస్తూ చెడిపోతున్నారని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇక సినిమా థియేటర్లు ఓపెన్ కావడంతో మళ్లీ సినిమాల మోత ప్రారంభమైంది.
ఈ నెల 18న విడుదల కానున్న డర్టీ హరి చిత్రం విడుదలకు ముందే వివాదాలను మూటగట్టుకుంది. యూసఫ్ గూడ నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్లే మార్గంలో ఉన్న మెట్రో పిల్లర్పై డర్టీహరీ పోస్టర్ను అతికించారు. ఇది వెంకటగిరి పరిధిలోకి వస్తుంది. ఈ పోస్టర్ అసభ్యకరంగా ఉంది. హీరో హీరోయిన్లు అర్థనగ్నంగా ఉన్న పోస్టర్ను అక్కడ అంటించారని ఇది చాలా ఇబ్బందికరంగా ఉందంటూ వెంకటగిరి నివాసితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇలాంటి అసభ్యకరమైన పోస్టర్లు అంటించడం వల్ల అటు వెళ్లే వాహనదారులు ఆ పోస్టర్ వంక చూస్తుండటంతో రోడ్ పై ఫోకస్ తప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే విషయాన్ని పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు అక్కడ న్యూసెన్స్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు.
రోడ్డుకు ఇరువైపులా కొన్ని చోట్ల పోస్టర్లు అతికిస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని గతంలోనే పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. అర్థనగ్నంగా ఉన్న ఫోటోలు పోస్టర్లుగా అంటిస్తుండటంతో వాహనదారులు వాటి వంక చూసి ప్రమాదానికి గురైన ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రధాన రహదారుల్లో ఇలాంటి పోస్టర్లును అంటించకుండా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలని అంటించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
పిల్లలతో కలిసి వాహనాల్లో ప్రయాణిస్తుంటారని అలాంటి సమయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని పలువురు పేరెంట్స్ చెబుతున్నారు. యువత కూడా ఇలాంటి పోస్టర్లు చూసి పక్కదారి పట్టే అవకాశాలున్నాయంటూ చెబుతున్నారు నిపుణులు.