హరీశ్ ఔట్, ఈటల డౌట్.. మంత్రివర్గ విస్తరణ మత్లబ్ క్యా హై?
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో ట్విస్టులు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టి రెండు నెలలు గడిచినా.. కేబినెట్ విస్తరణపై ఊసే లేకుండా పోయింది. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. 19వ తేదీ మంగళవారం నాడు కేబినెట్ కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి సోమవారం నాటికి సరిగ్గా 70 రోజులు. ఇక మంత్రివర్గ విస్తరణ 71వ రోజు జరగబోతోంది. లెక్కల్లో ఎక్కాలు సరిచూసుకున్న కేసీఆర్.. ఎట్టకేలకు మాఘ శుద్ధ పౌర్ణమి నాడు ముహుర్తం ఫిక్స్ చేశారు. అయితే ఇద్దరు సీనియర్లకు మంత్రివర్గంలో చోటు లేదనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.
34 కాదు ఇక 18
కొత్త మంత్రుల ఎంపికపై ఆదివారం నాడు సీఎం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో సభ్యుల సంఖ్యాబలం మేరకు 15 శాతం కోటాతో 18 మందికి మంత్రులుగా ఛాన్స్ దక్కుతుంది. అందుకే 34 శాఖలను ఒకే గొడుగు కిందకు తెచ్చి 18గా మార్చినట్లు సమాచారం. ఆ మేరకు కేసీఆర్ ఆదేశాలతో శాఖల పునర్వ్యవస్థీకరణ జరిగిందట. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోం మంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరించడంతో మరో 16 మందికి కేబినెట్ లో అవకాశం దక్కనుంది. ఆ మేరకు మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారనే టాపిక్ ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావుతో పాటు ఖజానా మంత్రి ఈటల రాజేందర్ కు కేబినెట్ లో చోటు ఉండకపోవచ్చనే ప్రచారం చర్చానీయాంశమైంది.
హరీశ్ కు లేనట్లే?
కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు.. తెలంగాణ ఉద్యమం తొలినాళ్ల నుంచి ఆయన వెంటే నడిచారు. మామ బొమ్మెస్తే.. అల్లుడు రంగేస్తాడు అనే రీతిలో మామా అల్లుళ్ల బంధం విజయవంతమైంది. ఎన్నికలైనా, పార్టీ కార్యక్రమాలైనా, ఆపరేషన్ ఆకర్ష్ ఐనా.. మామ డైరెక్షన్ లో అల్లుడు అల్లుకుపోయాడనేది అందరికీ ఎరుకే. అంతెందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ దండు అధినేతగా కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తే.. ఆయన కాంటెస్ట్ చేసిన గజ్వేల్ లో అన్నీ తానై చక్రం తిప్పిన హరీశ్ రావు మామకు విజయం కట్టబెట్టారు. అలాంటి చురుకైన నాయకుడికి ఈసారి కేబినెట్ లో బెర్త్ లేదనే ప్రచారం ఆయన అనుచరుల్లో కలవరం రేపుతోంది. హరీశ్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టడంలో పెద్ద స్కెచ్చే ఉందనే వాదనలు లేకపోలేదు. పంచాయతీ రాజ్, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖతో పాటు నీటిపారుదల శాఖను సైతం కేసీఆరే చూడబోతున్నారనే వార్త.. హరీశ్ రావును దూరం పెడుతున్నారనే ప్రచారానికి నిదర్శనం.
వందకు వంద.. మరీ ప్రాబ్లమేంటి?
గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వందకు వంద శాతం మార్కులు కొట్టేసిన ఈటల రాజేందర్ కు కూడా, ఈసారి కేబినెట్ లో బెర్త్ డౌటే అనే ప్రచారం కూడా విస్మయానికి గురిచేస్తోంది. కేసీఆర్ కు అత్యంత నమ్మకస్థుడిగా ముద్రపడ్డ బీసీ నేత ఈటలకు మంత్రి పదవి ఇవ్వకపోవడమేంటనే వాదనలు కొకొల్లలు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొప్పుల ఈశ్వర్ కు మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారనే వార్తలొస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల.. కేసీఆర్ కు ఉద్యమ సహచరుడు. ఖజానా మంత్రిగా సమర్థవంతమైన పాత్ర పోషించారనే పేరున్న ఈటలను మరి ఎందుకు పక్కన పెడుతున్నారనేది అర్థం కాని ప్రశ్న.
ఆ ఇద్దరు అటేనా?
హరీశ్ రావు, ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నేతలను మంత్రివర్గానికి దూరంగా ఉంచాలని కేసీఆర్ ఎందుకు భావిస్తున్నారంటే.. అర్థమై అర్థం కానట్లే ఉంది పరిస్థితి. దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ తో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ కు.. అదే స్థాయిలో పార్టీ నేతల సహకారం కావాల్సి ఉంటుంది. ఆ మేరకు వీరిద్దరినీ అటువైపు దారి మళ్లించనున్నారనే ప్రచారం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే వీరిని రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీలుగా నిలబెట్టాలనేది కేసీఆర్ అంతరంగంగా కనిపిస్తోంది. దాన్ని ధృవీకరించేటట్లుగా.. సిద్ధిపేట నుంచి హరీశ్ రావు సతీమణి ఎమ్మెల్యే బరిలోకి దిగనున్నారని సోషల్ మీడియా కోడై కూసింది.
6 నమ్మకం.. 8 గురి?
జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలు బలంగా నమ్మే కేసీఆర్ ఆరో సంఖ్యను తనకు అచ్చొచ్చినట్లుగా విశ్వసిస్తారు. అదే సమయంలో 8వ నెంబరుకు కూడా ఇటీవల ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి 71వ రోజున మంత్రివర్గ విస్తరణకు పూనుకున్నారు. 7,1 కలిపితే టోటల్ 8 అవుతుంది. అదే క్రమంలో కేబినెట్ లోకి మంగళవారం నాడు 8 మందిని మాత్రమే తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. 10 మందిని తీసుకుంటారనే వార్తలు వస్తున్నప్పటికీ.. ఈ లెక్కలకు ఆయన ఫిక్స్ ఐతే మాత్రం 8కే మొగ్గుచూపనున్నారు. అదలావుంటే హరీశ్ రావును కచ్చితంగా పక్కనపెట్టాలని డిసైడ్ అయిన కేసీఆర్.. ఈటల విషయంలో మాత్రం ఆచితూచి ఆలోచిస్తున్నారట. రాజేంద్రుడి విషయంలో తొలుత ఊగిసలాట ధోరణి కనబరిచినా.. చివరకు ఆయనకు మంత్రి పదవి ఖాయమన్నట్లుగా కేసీఆర్ సంకేతాలిచ్చారట మరి.