మంత్రి నా కాళ్లు మొక్కుడేంది.. ఆ వార్తపై హరీష్ రావు ఆగ్రహం.. చివరకు సారీ చెప్పారుగా..!
Recommended Video
హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి ఓ మీడియా సంస్థకు చురకలు అంటించారు. అత్యుత్సాహం వద్దని.. నిర్ధారణ చేసుకున్నాకే వార్తలు రాయాలని చురకలు అంటించారు. ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన కాళ్లు మొక్కారనే వార్త నిజం కాదని కొట్టిపారేశారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా వార్త ఎలా రాస్తారని ప్రశ్నించారు. చివరకు ఎడిటోరియల్ టీమ్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
ఇదివరకు కూడా ఓసారి జాతీయ స్థాయి ఇంగ్లీష్ దినపత్రికపై హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నానంటూ కథనం వండివార్చిన ఆ పత్రిక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదే క్రమంలో తాజాగా జరిగిన ఘటనను సోషల్ మీడియా వేదికగా ఖండించారు.
హరీష్ రావు దూసుకెళుతున్నారుగా.. అప్పుడలా, ఇప్పుడిలా..!
జరిగిందొకటి.. రాసిందొకటి..!
హైదరాబాద్ సనత్ నగర్ సమీపంలోని బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలు మంగళవారం నాడు ఘనంగా జరిగాయి. అయితే ఆ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా హాజరయ్యారు. అమ్మవారి కల్యాణం జరిగే సమయంలో ఆ ముగ్గురూ కలిసి కూర్చున్నారు.
అయితే అమ్మవారి కల్యాణం తంతు ముగిశాక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లేచి నిలబడటానికి ప్రయత్నించారు. చాలాసేపు కూర్చున్న కారణంగానో లేదంటే వయసురీత్యానో ఆయన కాసింత ఇబ్బంది పడ్డారు. దాంతో పక్కనే ఉన్న హరీష్ రావు చేయి అందించారు. యాదృచ్ఛికమో ఏమో గానీ ఆ సందర్భం కెమెరా కంటికి చిక్కింది.
అలా ఎలా రాస్తారు.. నిజం తెలుసుకుని వార్తలు రాయండి..!
అదలావుంటే ఆ ఫోటో ఆధారంగా ఓ దినపత్రిక ప్రచురించిన వార్తను హరీష్ రావు ఖండించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన కాళ్లను మొక్కుతున్నట్లుగా రాసిన ఆ వార్త అబద్దమంటూ పేర్కొన్నారు. ఆ మేరకు ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా చురకలు అంటించారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదనే రీతిలో వ్యాఖ్యానించారు. నిజ నిర్ధారణ చేసుకోకుండా వార్త ఎలా రాస్తారని ప్రశ్నించారు.
ఈ వార్త పూర్తిగా అవాస్తవం. గౌరవ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు నేలమీది నుండి లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తుండగా సాయపడ్డాను. దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రచురించారు. ఈ వార్తను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది బాధాకరం. భవిష్యత్ లో వార్తలు ప్రచురించేముందు నిర్ధారణ చేసుకుని ప్రచురించాలనికోరుతున్నా అంటూ పోస్ట్ చేశారు.
సమాచార లోపంతో పొరపాటు.. క్షమాపణలు కోరిన ఎడిటోరియల్ టీమ్..!
హరీష్ రావు వ్యాఖ్యలతో సదరు దినపత్రిక ఎడిటోరియల్ టీమ్ స్పందించింది. వార్త ప్రచురణలో పొరపాటు జరిగిందని ఒప్పుకుంది. కింద కూర్చున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా లేపడానికి హరీష్ రావు ప్రయత్నించారని.. ఆ క్రమంలో ఆయన్ని చేతులతో పట్టుకుని నిలబెట్టారని పేర్కొంది. సమాచార లోపం వల్ల కాళ్లు మొక్కుతున్నట్లుగా వార్త పబ్లిష్ అయిందని.. పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావుకు కలిగిన మనస్తాపానికి ఎడిటోరియల్ టీమ్ తరపున క్షమాపణ చెబుతున్నామంటూ మరో వార్త ప్రచురించింది.
తుపాకులు చేతబట్టి తాగుతూ ఊగుతూ.. బీజేపీ ఎమ్మెల్యే మరోసారి హల్చల్..! (వీడియో)
బీజేపీలో చేరతారంటూ వార్తలు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్..!
ఇదివరకు హరీష్ రావు బీజేపీలో చేరుతున్నారంటూ జాతీయ స్థాయి ఇంగ్లీష్ దినపత్రిక రాసిన వార్తపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ బ్యానర్ వార్తగా ప్రచురించడంతో దుమారం రేగింది. జాతీయ స్థాయిలో అత్యధిక సర్కులేషన్ ఉన్న సదరు పత్రిక అలా రాయడాన్ని ఆయన ఖండించారు. ఏప్రిల్ ఒకటోతేదీన వచ్చిన ఆ వార్త అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఆ వార్త చివరన ‘ఈ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే అని గుర్తించుకోండి' అంటూ ముగించడం గమనార్హం.
దేశవ్యాప్త గుర్తింపు ఉన్న సదరు పత్రిక ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచురించడం సరికాదన్నారు హరీష్ రావు. ఫేక్ న్యూస్పై పోరాటం జరుగుతున్న తరుణంలో ఇలాంటి వార్తలు రాయడం పద్దతి కాదన్నారు. ఫ్రంట్ పేజీలో ఎక్కడైతే ఆ వార్త ప్రచురించారో అదే స్థలంలో క్షమాపణ చెబుతూ మరో వార్త ప్రచురించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.