సీఎం కేసీఆర్ చెప్పింది ఇలా అర్థమైందా.. మొక్కలు నాటమంటే ఏం చేశారో తెలుసా..! (వీడియో)
Recommended Video
హైదరాబాద్ : మొక్కలు నాటమంటే మొక్కుబడి వ్యవహారం అనుకున్నారు ఓ టీఆర్ఎస్ లీడర్. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హరితహారం అంటూ మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ లీడర్ ఏం చేశారో తెలుసా? ఫోటోలకు ఫోజులిచ్చి చేతులు దులుపుకున్నారు. అది సరే.. ఇంతకు మొక్కైనా నాటారా అంటే అదీ లేదు.. ఏదో చెట్టుకొమ్మను పట్టుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కాస్తా మమ అనిపించారు. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగితే ఇంత హైలైట్ అయి ఉండేది కాదేమో. హైదరాబాద్ మహానగరంలో బుద్దుడి సాక్షిగా జరిగిన ఘటన కాబట్టే సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
పల్లెలు పచ్చబడాలి. అన్నదాత తలెత్తుకుని బతకాలి. ఇదంతా జరగాలంటే పచ్చదనం పెరగాలి. అందుకు మొక్కలు పెంచడమొక్కటే మార్గం. అందుకే హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ క్షేత్రస్థాయిలో కొందరు టీఆర్ఎస్ నేతలు ఇలా మొక్కుబడిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అపహాస్యం చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఎందుకు.. ఏమిటి.. ఎలా..!
నగరం : హైదరాబాద్
ఏరియా : ట్యాంక్బండ్
కార్యక్రమం : హరిత హారం
నిర్వహణ : టీఆర్ఎస్ నేతలు
నేతృత్వం : గోషామహల్ లీడర్ మహేందర్
ఏం చేయాలి : మొక్కలు నాటాలి
ఏం చేశారు : మొక్కలకు బదులుగా చెట్టుకొమ్మలు నాటారు
ఇంతకు ఏం జరిగింది : ఇలా మొక్క నాటారో లేదో అలా ఠపీమని పడిపోయింది. గోతి తవ్వలేదు.. మొక్క నాటలేదు. ఏదో చెట్టుకొమ్మను తెచ్చి మమ అనిపించారు సదరు లీడర్. సీఎం కేసీఆర్ హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఓవైపు సీరియస్గా చెబుతుంటే.. మరోవైపు కొందరు లీడర్లేమో కామెడీ చేస్తున్నారు. ఫోటోలకు ఫోజులిస్తూ తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో హైదరాబాద్ గోషామహల్కు చెందిన గులాబీ నేత మహేందర్ అడ్డంగా దొరికిపోయారు. మొక్క గాకుండా చెట్టుకొమ్మను నాటి కెమెరాకు స్టిల్స్ ఇచ్చిన సదరు నేత తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తెలంగాణలో మహారాష్ట్ర SI రచ్చ.. తుపాకీతో హల్చల్.. చివరకు..! (వీడియో)
ఇదేందీ మహేందరా.. మొక్కలు నాటబోయి ఇరుక్కుపోయారా?
తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేసే పథకమే హరితహారం. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని కామెడీగా మార్చేశారు గోషామహల్ లీడర్ మహేందర్. ట్యాంక్బండ్పై మొక్కలు నాటుతున్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చారు గానీ మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు లేదు. సాధారణంగా ఒక మొక్కను నాటాలంటే మొదట గుంతను తవ్వాలి. అయితే సదరు లీడర్ మాత్రం ఆ విషయం మరిచిపోయారు. అంతేకాదు మొక్కను నాటకుండా చెట్టుకొమ్మను ఏదో అలా నాటినట్లుగా బిల్డప్ ఇచ్చి హరితహారం తంతు ముగించారన్నమాట. ఫోటోలు దిగి హమ్మయ్య కార్యక్రమం అయిపోయిందని ఆ నేతతో పాటు అనుచరగణం అలా వెళ్లిపోయిందో లేదో ఆ చెట్టుకొమ్మ నేలవాలింది.
కెమెరా కంటికి చిక్కి.. మొక్కుబడిగా హరితహారం
మొక్కకు బదులు చెట్టుకొమ్మ నాటడం.. అది పడిపోవడం.. ఈ సీనంతా కూడా కెమెరా కంటికి చిక్కడంతో సదరు నేత బండారం బయటపడింది. హరితహారం కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇలా ప్రభుత్వ విధానాలను తుంగలో తొక్కుతారా అనే వాదనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరైతే కేసీఆర్ చెప్పిందేంటి.. మీరే చేసిందేంటి మహేందరా అని కామెంటుతున్నారు. మరికొందరేమో మొక్కుబడిగా హరితహారం.. మొక్కలకు బదులు చెట్టుకొమ్మలు నాటబోయి.. ఇదేందీ సామీ అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
2015లో శ్రీకారం.. ప్రతిష్ట్మాత్మకంగా కార్యక్రమం
తెలంగాణకు హరితహారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమానికి 2015 జులైలో అంకురార్పణ జరిగింది. చిలుకూరు బాలాజీ దేవాలయం ఆవరణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలను నాటి, పచ్చదనం వికసించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఆ క్రమంలో 2016 లోనే 46 కోట్ల మొక్కలు నాటడం విశేషం. నీడనిచ్చే చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు, ఔషధ మొక్కలను కూడా హరితహారంలో చేర్చారు.
హరీశ్ రావు కొత్త స్కెచ్.. ఆ ఇలాకాలో అలా.. అక్కడే ఎక్కువగా ఎందుకో తెలుసా?
ఊరూరా ఉద్యమంలా.. పది జిల్లాలు పచ్చబడేలా..!
ఉమ్మడి పది జిల్లాలు పచ్చబడాలంటే కోట్లాది మొక్కలు కావాలి. ఊరూరా ఉద్యమంలా చెట్లను నాటాలి. గత పాలకుల నిర్లక్ష్యానికి తోడు, ప్రకృతి మార్పులు కూడా తెలంగాణ రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. పర్యావరణ విధ్వంసంలో భాగంగా అడవుల నరికివేత భారీ ఎత్తున జరిగింది. దాంతో పచ్చదనం కనుచూపు మేరలో కనబడకుండా పోయింది. ఈ ప్రభావం పర్యావరణ అసమతుల్యతకు దారితీసింది. ఆ క్రమంలో మొక్కలు నాటి చెట్లను పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడితేనే భవిష్యత్ తరాలు బాగుంటాయని సీఎం కేసీఆర్ బలంగా నమ్మారు. అందుకే హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కేసీఆర్ ఏమంటారో మరి.. ఇలా చేస్తే ఎలా సామీ..!
టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రతి సందర్భంలోనూ హరితహారం ప్రస్తావిస్తున్నారు. మొక్కలు విరివిగా నాటాలనే సందేశం ఇస్తున్నారు. పార్టీ క్యాడర్, లీడర్లు హరితహారంలో చురుకుగా పాల్గొనాలని చెబుతూ వస్తున్నారు. ఆ క్రమంలో గోషామహల్ లీడర్ మహేందర్ చేసిన నిర్వాకం ఇప్పుడు హరితహారం కార్యక్రమం జరుగుతున్న తీరును అపహాస్యం చేసేలా ఉంది. ఈ నాయకుడు చేసిన పొరపాటు నెటిజన్ల చేతికి వీడియో రూపంలో దొరకడంతో చెడుగుడు ఆడేస్తున్నారు. అయితే ఇదే తంతు రాష్ట్రమంతటా జరుగుతుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. మొత్తానికి ఈ విషయంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.