ఖజానా ఖాళీ అయ్యిందా ... తెలంగాణా ఆర్ధిక పరిస్థితి మరీ ఇంత దారుణంగా తయారైందా ?
తెలంగాణా రాష్ట్రం ధనిక రాష్ట్రం అది ఒకప్పుడు..కానీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం అప్పుల రాష్ట్రం . మనది ధనిక రాష్ట్రం అంటూ గొప్పలు చెప్పుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ ఇన్నీ కావు. ఇక సీఎం కేసీఆర్ ఉద్యోగస్తులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. రిటైర్ అయిన తర్వాత వారికి ఇవ్వాల్సిన అన్ని బెనిఫిట్స్ ఒకే సారి ఇచ్చేసి కారులో దర్జాగా ఇంటికి పంపిస్తామని చెప్పిన సీఎం మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది.
తెలంగాణా ఖజానా ఖాళీ .. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి
రిటైర్ అయిన ఉద్యోగులు నెలల తరబడి తమ బెనిఫిట్స్ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. 104 సర్వీసు ఉద్యోగస్తులకు నాలుగు నెలలుగా జీతాల్లేని పరిస్థితి. భగీరథ రుణాలను తిరిగి చెల్లించే ప్రక్రియ ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ కావాల్సి ఉన్నా అవి చెల్లించలేని దుస్థితి . ఖర్చుల మీద ఖర్చులు చేస్తూ, ఒక లెక్కా పత్రం లేకుండా నిధులను ఇష్టారాజ్యంగా వాడేసిన ఫలితం ఇప్పుడు తెలంగాణా ఖజానా ఖాళీ అయ్యింది. కొత్త అప్పు తెస్తే కానీ బండిని నడపలేని పరిస్థితి తెలంగాణలో ప్రస్తుతం వుందని తాజా పరిస్థితులు చెప్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా చిన్న చిన్న బిల్లులను సైతం చెల్లించలేని దయనీయ స్థితి నెలకొన్నాఆర్థిక శాఖ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది తప్ప చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తామనే భరోసా మాత్రం కల్పించలేకపోతుంది.
ఆవగింజంత ఆదాయం.. కొండంత వ్యయం ... అనాలోచిత నిర్ణయాల పర్యవసానం
కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం పడిందని చెప్పక తప్పదు. తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కి కూడావేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఆదాయం అనుకున్నంతగా లేదు కానీ వ్యయం మాత్రం కొండంత ఉంది. అనాలోచిత నిర్ణయాలు , పక్కా ప్రణాళికా బద్దంగా వ్యవహరించకపోవటం, ఇష్టారాజ్యంగా సంక్షేమ పథకాలను ప్రకటించటం వంటి అనేక అంశాల వల్ల ఆర్ధిక పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో చిన్న చిన్న బిల్లుల చెల్లింపునకు సైతం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న పరిస్థితి తెలంగాణా రాష్ట్రంలో నెలకొంది. దీంతో.. పనులు చేసిన కాంట్రాక్టర్లు , జీతాలు ఆపిన వివిధ శాఖల చిరు ఉద్యోగులు కుదేలవుతున్నారు. సంపన్న తెలంగాణ అని చెప్పుకున్న కేసీఆర్.. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎవరూ ఊహించనంతగా దిగజార్చారు.
అసలు ఆదాయానికి, ఖర్చుకు ఒక అంచనా లేని ప్రభుత్వం .. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నా ఏం లాభం
ప్రతి నెలా తక్కువలో తక్కువ రూ.4వేల కోట్ల ఖర్చు తెలంగాణా రాష్ట్రంలో అవుతుంటే ఏడాదికి రూ.48వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం తమ పని తాము చేసేందుకు అయ్యే ఖర్చు. ఇక ప్రజలకు అందించే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. ప్రాజెక్టుల నిర్మాణం.. పనులు చేయటంలాంటి వాటికి అదనపు ఖర్చు. మరింత భారీగా ఖర్చు ఉన్నప్పుడు ఆదాయ వనరుల విషయం అటుంచి ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అర్ధం అయినా చెయ్యగలిగేది ఏది లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు .
అన్ని శాఖల్లో పెండింగ్ లో ఉన్న బిల్లుల మొత్తం రూ.22400 కోట్లు.. అప్పుల ఊబిలో తెలంగాణా
ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో పెండింగ్ లో ఉన్న బిల్లుల మొత్తం రూ.22400 కోట్ల వరకు ఉన్నాయని చెబుతున్నారు. వీటిల్లో సాగునీటి బిల్లులే రూ.10వేల కోట్ల వరకూ ఉందని సమాచారం . వస్తున్న ఆదాయం అంతంతమాత్రంగా ఉండటం.. ఖర్చు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. తెలంగాణా రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రం కాదు లోటు బడ్జెట్ రాష్ట్రం అని చెప్తూ అప్పుల దిశగా తన ప్రయాణాన్ని ప్రారం భించింది. కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తూ అప్పుల ఊబిలో చిక్కుకుపోతుంది. ఇక ఇప్పటికైనా తెలంగాణా సర్కార్ కళ్లు తెరవకుంటే.. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత హీన స్థితికి చేరుకుంటుందని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.