హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసు కథ.. ఇవీ నిజాలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసు కథ కొలిక్కి వచ్చింది. ఎనిమిది రోజుల తర్వాత ఆమె కిడ్నాపర్ చెర నుంచి బయటపడ్డారు. అయితే ఈ కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు నిందితుడు పట్టుబడితే గానీ అసలు నిజాలు బయటపడలేదు. రవిశేఖర్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించాడు.
కిడ్నాపర్ భయపడి.. చివరకు
ఈ నెల 23వ తేదీ మంగళవారం నాడు కిడ్నాపర్ రవిశేఖర్ సోని కుటుంబ సభ్యులను నమ్మించి ట్రాక్లోకి దించాడు. సోనికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కారులో ఎక్కించుకుని పరారయ్యాడు. అలా దాదాపు ఎనిమిది రోజుల పాటు తప్పించుకుని తిరిగాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చివరకు అతడి సమాచారం ఇస్తే లక్ష రూపాయల నజారానా ఇస్తామంటూ ప్రకటించారు. ఆ క్రమంలో తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని కిడ్నాపర్ బయపడ్డాడు. అయితే ఇన్నీ రోజులు సోనిని ఎక్కడ దాచాడనేది పెద్ద ప్రశ్న.
తెలంగాణలో కరెంట్ కష్టాలా.. రెండు రోజులు దాటితే చీకట్లేనా?
ఏపీలో అరెస్ట్.. హైదరాబాద్కు షిఫ్ట్
ఆ క్రమంలో ఏపీలో సదరు నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకురానున్నారు. సోనిని ఎనిమిది రోజులుగా కారులో తిప్పుతూ పెట్రోల్ బంకుల సమీపంలో బస చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. చిలకలూరిపేట, కడప, తిరుపతి, ప్రకాశం, నల్గొండ ప్రాంతాల్లో తిరిగినట్లు చెప్పాడు. అదలావుంటే ఈ కిడ్నాప్కు ముందు సోమవారం నాడు నల్గొండలో ప్రభుత్వ ఉద్యోగినంటూ బెదిరించి ఓ వ్యాపారి నుంచి 80 వేల రూపాయలు వసూలు చేశాడట. అదే డబ్బును సోనికి చూపించి నల్గొండ నుంచి తొలుత చిలుకలూరి పేటకు తీసుకెళ్లానని పోలీసులకు వివరించాడు.
ఉద్యోగంపై నిలదీసిన సోని.. చివరకు ఇలా
అయితే ఈ ఎనిమిది రోజులుగా ఉద్యోగం గురించి మాయమాటలు చెప్పిన రవిశేఖర్ను సోని గుడ్డిగా నమ్మినట్లు తెలుస్తోంది. సోమవారం (29.07.2019) నాడు ఉద్యోగం ఏమైందంటూ సోని గట్టిగా నిలదీసిన క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందట. అదే సమయంలో అటువైపు పోలీస్ వాహనం రావడంతో భయపడ్డ రవిశేఖర్ అక్కడి నుంచి పారిపోయాడట.
అలా చిలుకలూరిపేట అద్దంకి హైవేపై హైదరాబాద్ బస్సెక్కిన సోని మంగళవారం (30.07.2019) నాడు తెల్లవారుజామున హైదరాబాద్లోని మహాత్మగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్కు చేరుకున్నారు. అదే సమయంలో తన స్నేహితురాలు మౌనిక అక్కడ కనిపించడంతో ఆమె ఫోన్ ద్వారా సోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం చెరవేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు సోనిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. తర్వాత కోఠి మెటర్నిటీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.