పిట్టీ కేసుల్లో ప్రతాపం.. సైకో కేసులో ఫెయిల్యూర్?.. పోలీసులకు శీనుగాడి తిప్పలు..!
హైదరాబాద్ : వాడు మామూలోడు కాదు. మౌనంగానే ఉంటూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. హత్యాచారాలకు ముందు పెదవి విప్పనోడు.. రాక్షస క్రీడల అనంతరం కలివిడిగా ఉన్నట్లు నటిస్తాడు. అలా వరుస హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైకో శీనుగాడి లీలలు అన్నీ ఇన్నీ కావు. శ్రావణి హత్యోదంతంతో వెలుగుచూసిన ఆ నరరూప రాక్షసుడి బాగోతం భయాందోళన రేకెత్తించింది. అతి కిరాతకంగా అమ్మాయిలను అత్యాచారం చేసి చంపిన సైకో శీనుగాడి ఉదంతం రాష్ట్రమంతటా హాట్ టాపికయింది. చివరకు వాడి పాపం పండి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. అయితే పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తుంటే మాత్రం నోరు విప్పడం లేదు, నిజాలు చెప్పడం లేదు.
ప్రేమ పెళ్లికి 'నో' చెప్పిన పెద్దలు.. నవదంపతులపై దాడి
నోరు విప్పేదెలా.. నిజాలు కక్కేదెలా?
హాజీపూర్ సీరియల్ కిల్లర్, సైకో శీనుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడం, జైలుకు పంపించడం చకచకా జరిగిపోయాయి. శ్రావణి హత్యోదంతంతో వెలుగుచూసిన ఆ కిరాతకుడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మనీషా, కల్పన అనే అమ్మాయిలతో పాటు ఒక మహిళను అత్యాచారం చేసి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నాడు. అయితే వాడి బారిన ఇంకెంతమంది పడ్డారోననే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
వరంగల్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సైకో శ్రీనివాస్ రెడ్డిని విచారించేందుకు ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. వాడి ఫేస్బుక్ పేజీలో 500కు పైగా అమ్మాయిలతో స్నేహం కొనసాగిస్తున్నాడనే విషయం బయటపడటంతో ఇంకేమైనా దారుణాలకు ఒడిగట్టాడా అనే కోణంలో విచారిస్తున్నారు. అయితే జైలుకు వెళ్లకముందు పోలీసుల దర్యాప్తులో నాలుగు హత్యలకు సంబంధించి నిజం ఒప్పుకున్న సైకో శీనుగాడు.. కస్టడీకి తీసుకున్న తర్వాత నోరు విప్పడం లేదని సమాచారం.
మౌనమే సమాధానం..!
ఈ నెల 8వ తేదీన ఆరు రోజుల పోలీసుల కస్టడీకి సైకో శీనుగాడిని అప్పగించేందుకు కోర్టు ఓకే చెప్పింది. ఆదివారం (12.05.2019) నాటితో ఐదు రోజులు గడిచిపోయాయి. అయితే ఈ ఐదు రోజుల్లో వాడు నోరు విప్పింది లేదు, నిజం చెప్పింది లేదు. హత్యాచారాలకు ముందు ముభావంగా ఉంటాడని వాడి స్నేహితులు చెప్పినట్లే.. పోలీసుల విచారణలో కూడా అలాగే ఉంటున్నాడు. సీరియల్ కిల్లర్ సైకో శీనుగాడితో నిజాలు కక్కించలేక సిట్ అధికారులు ముప్పు తిప్పలు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నివిధాలా ప్రయత్నించినా, ఎంతలా అడిగినా.. ఒక్క ముక్క కూడా చెప్పడం లేదట. పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసినా మౌనమే సమాధానంగా వస్తున్నట్లు సమాచారం. ఆ నాలుగు హత్యల గురించి తప్ప ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదని తెలుస్తోంది. దాంతో వాడి మొబైల్ ఫోన్ కు సంబంధించి కాల్ డేటాను పరిశీలించడానికి ప్రయత్నిస్తున్నారు. సోమవారం నాడు సైకో శీనుగాడిని కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో.. వాడి నుంచి నిజాలు కక్కించలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నట్లు వినికిడి.
నాలుగు హత్యల గురించే తప్ప..!
హాజీపూర్ వరుస హత్యల నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై అక్కడి గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాడు కనిపిస్తే కొట్టి చంపేయాలనే కసితో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదివరకే వాడి ఇల్లును కాల్చి బూడిద చేశారు. అదలావుంటే సైకో శీనుగాడిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్న తర్వాత ఘటనాస్థలాలకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఉదయం పూట ఐతే గ్రామస్థులు దాడి చేసే అవకాశముందని.. గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో ఆ తంతు ముగించారు.
వాడి నేరాలకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి భద్రపర్చారు పోలీసులు. అటు శ్రీనివాస్రెడ్డి కుటుంబసభ్యులను కూడా ప్రశ్నించారు. అయితే ఆరు రోజుల కస్టడీలో భాగంగా ఇప్పటివరకు మాత్రం శ్రావణి, మనీషా, కల్పన అనే మైనర్లతోపాటు కర్నూలులో ఓ మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు శ్రీనివాస్రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.
నిన్న కర్నూలు.. నేడు కరీంనగర్.. నెత్తురోడుతున్న రహదారులు
పిట్టీ కేసుల్లో ప్రతాపం..! సైకోగాడి విషయంలో ఫెయిల్యూరా?
సైకో శీనుగాడి మౌనం పోలీసుల పాలిట తలనొప్పిలా మారింది. వాడిని విచారించేందుకు కోర్టు చుట్టూ తిరిగి ఆరు రోజుల కస్టడీకి తీసుకుంటే ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోయాయి. ఇక మిగిలింది ఒక్క రోజే. ఇన్ని రోజులు మౌనం దాల్చిన సైకో గాడు ఒక్క రోజులో మొత్తం వివరాలు పూసగుచ్చినట్లు చెప్పడం కష్టమే. అయితే వాడి నుంచి నిజాలు కక్కించడంలో పోలీసులు విఫలమయ్యారనే టాక్ జోరందుకుంది.
పిట్టీ కేసుల్లో నిందితులను టార్చర్ పెట్టి, శరీరం కందిపోయేలా కొట్టి నిజాలు గక్కించే పోలీసులు సైకో శీనుగాడి విషయంలో ఎందుకు నిజాలు కక్కించలేకపోతున్నారు. చిన్న చిన్న కేసుల్లో నానా హడావిడి చేస్తారు.. మరి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సైకోగాడి విషయంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు. కస్టడీకి తీసుకుని నిందితుడి నుంచి మొత్తం వివరాలు సేకరిస్తామని కోర్టుకు చెప్పి.. ఇంతకీ పోలీసులు ఏం చేసినట్లు. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. మరి సమాధానం చెప్పాల్సిన పోలీసులు ఏమంటారో?