నేరెడ్మెట్ ఎన్నిక ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్... ఆ ఓట్లు కూడా లెక్కించాలన్న హైకోర్టు...
హైదరాబాద్ నేరెడ్మెట్ డివిజన్ ఎన్నిక ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్రతో ఉన్న 544 ఓట్లను కూడా లెక్కించాలని కోర్టు ఆదేశించింది. ఓట్లను మళ్లీ లెక్కించాలని ఆదేశించింది. అయితే రీకౌంటింగ్ ఎప్పుడు జరుగుతుందన్న దానిపై అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
బ్యాలెట్ పేపర్పై స్వస్తిక్ గుర్తుకు బదులు ఇతర ముద్ర ఉన్న ఓట్లు ఎక్కువగా ఉండటంతో హైకోర్టు ఆదేశాల మేరకు నేరెడ్మెట్లో లెక్కింపును నిలిపివేశారు. ఈసారి గ్రేటర్ పోలింగ్లో కొన్నిచోట్ల స్వస్తిక్ ముద్రకు బదులు పోలింగ్ కేంద్రం సంఖ్యను తెలిపే ముద్రను ఓటర్లకు ఇచ్చామని... కాబట్టి వాటిని కూడా ఓట్ల లెక్కింపులో పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల కమిషన్ పోలింగ్ ముందురోజు (డిసెంబర్ 3) అర్ధరాత్రి సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా... స్వస్తిక్ మినహా ఇతర ముద్రలు కలిగి ఉన్న ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని కోర్టు సూచించింది. ఒకవేళ గెలుపోటములు ఆ ఓట్లపై ఆధారపడి ఉంటే... దానిపై ప్రత్యేక ఆదేశాలిస్తామని చెప్పింది. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టు జోక్యానికి తావు లేదని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు విన్నవించగా... న్యాయస్థానం ఆ వాదనను తోసిపుచ్చింది. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్రతో ఉన్న ఓట్లను కూడా లెక్కించాలని తాజాగా ఆదేశాలిచ్చింది.
Recommended Video
కాగా,ఈసారి ఈసారి గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడింది. ఓటర్లు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టలేదు. మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 55 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. వరుసగా అటు దుబ్బాక ఉపఎన్నికతో పాటు ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో నాగార్జునసాగర్ ఉపఎన్నిక అనివార్యమవడంతో ఇప్పుడు బీజేపీ దానిపై ఫోకస్ చేసింది.