HCUలో అడ్మిషన్స్: కొత్తగా ప్రారంభం కానున్న కోర్సులు ఇవే.. చివరి తేదీ ఎప్పుడంటే..?
హైదరాబాదు: కరోనావైరస్తో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు మూతపడ్డాయి. లాక్డౌన్ నడుస్తున్నప్పటికీ హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్శిటీ మాత్రం తన అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించింది. 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ పొందేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇక వివిధ కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా (http://acad.uohyd.ac.in) దరఖాస్తులు సబ్మిట్ చేయాలని చెప్పిన హెచ్సీయూ... దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 3 మే 2020గా పేర్కొంది. ఇక వివిధ కోర్సులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ 2 జూన్ నుంచి 6 జూన్ , 2020 వరకు నిర్వహిస్తామని హెచ్సీయూ వెల్లడించింది. ఇక గత విద్యాసంవత్సరంతో పోలిస్తే 2020-21 విద్యాసంవత్సరంలో ఆయా కోర్సుల్లో సీట్లను కూడా పెంచింది. గతేడాది 2170 సీట్లు ఉండగా ఈ ఏడాది 2400 సీట్లు ఉంటాయని తెలిపింది.
అంతేకాదు కోర్సులను కూడా పెంచింది హెచ్సీయూ. గతేడాది 119గా ఉన్న కోర్సుల సంఖ్య ఇప్పుడు 128గా ఉన్నాయి. ఇందులో 16 ఇంటిగ్రేటెడ్ కోర్సులు, 41 పీజీ కోర్సులు, 15 ఎంఫిల్ , 10 ఎంటెక్, 46 పీహెచ్డీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 38 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఇదిలా ఉంటే 200కు తక్కువగా అప్లికేషన్లు వచ్చిన సెంటర్లలో పరీక్ష నిర్వహించబోదని హెచ్సీయూ స్పష్టం చేసింది.
ఇక యూనివర్శిటీ ఈ ఏడాది 7 కొత్త కోర్సులను ప్రారంభించనుంది. అవి ఎంఏ జెండర్ స్టడీస్, ఎంఏ కమ్యూనికేషన్స్ (మీడియా స్టడీస్)మరియు ఎంఏ కమ్యూనికేషన్ (మీడియా ప్రాక్టీస్), ఎంటెక్ మైక్రో ఎలక్ట్రానిక్స్ & వీఎల్ఎస్ఐ డిజైన్, ఎంటెక్ మానుఫాక్చురింగ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మైక్రోబయాలజీలో పీహెచ్డీ మరియు ఎఈడీ ఎడ్యుకేషన్ కోర్సులను ప్రారంభించనుంది. ఇదిలా ఉంటే ఎంసీఏ కోర్సుకు అడ్మిషన్ నిమ్సెట్ స్కోరు ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పరీక్షను నిట్ నిర్వహిస్తుంది. ఇక 8 ఎంటెక్ కోర్సులకు అడ్మిషన్లు గేట్ ద్వారా జరిగే సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఆఫ్ ఎంటెక్ (సీసీఎంటీ) ద్వారా ఉంటాయి. ఇక ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అడ్మిషన్ జేఈఈ స్కోరు ద్వారా ఉంటుంది. ఇక ఎంబీఏ అడ్మిషన్స్ క్యాట్ స్కోరు ఆధారంగా ఉంటుంది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీకి అడ్మిషన్లు ఢిల్లీలోని జేఎన్యూ నిర్వహించే సీబ్ పరీక్ష ద్వారా ఉంటుంది.