హైదరాబాద్ మళ్లీ ఆగం: తాజా పరిస్థితి - జలదిగ్బంధం - ఇద్దరు మృతి - హైవేలు బంద్ - కూలిన గోల్కొండ గోడ
వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్లు అక్టోబర్ నెలలో 32 సెంటీమీటర్ల వాన పడి, భారీ వరదలు ముంచెత్తిన విషాదం నుంచి కోలుకునేలోపే విశ్వనగరం హైదరాబాద్ పై వరుణుడు పగపట్టాడా అన్నట్లు మరోసారి భారీ వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము దాకా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది. దీంతో అప్పటికే మునిగిపోయి ఉన్న లోతట్టు ప్రాంతాల్లోకి మరింత నీరు వచ్చిచేరింది. మరోవైపు చారిత్రక గోల్కొండ కోటలోని ఓ భాగం వర్షాల కారణంగా కూలిపోయింది.
Recommended Video
తహసీల్దార్ నాగరాజుది హత్యే: జైలులో ఖైదీల మధ్య ఆత్మహత్యా?: కుటుంబీకుల ఆరోపణ -సీబీఐతో
10 గంటలు గ్యాప్ లేకుండా..
శనివారం సాయంత్రం 5 గంటల నుంచే నగరమంతటా కారుమేఘాలు విస్తరించి, రాత్రి7 గంటల నుంచి వర్షం అందుకుంది. వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 5 గంటల వరకు గ్యాప్ లేకుండా వాన కురుస్తూనే ఉంది. హయత్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మలక్ పేట, మీర్ పేట, చార్మినార్, బాలాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదుకావడంతోపాటు అక్కడి లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలోకి వెళ్లాయి. రాత్రికి రాత్రే రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిని ముమ్మరం చేశారు.
వర్షపాతం వివరాలివి..
శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఘట్ కేసర్ లో అత్యధికంగా 18.1 సెంటీమీటర్లు, నాగోలు, ఫిర్జాది గూడలో 16.9, సరూర్ నగర్ 16.6, ఎల్బీ నగర్ 16.4, బండ్లగూడ 15.3, హబ్సిగూడ 15.2, రామాంతపూర్ 14.9, ఉప్పల్ 14.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లోని విద్యుత్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, పలు అపార్ట్ మెంట్లు నీట మునగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సీఎంగా వైఎస్ భారతి లేదా విజయమ్మ - సారీ చెప్పకుంటే జగన్ పదవి పోవడం ఖాయం: ఎంపీ రఘురామ
ఐదేళ్ల బాలుడు సహా..
అక్టోబర్ 15 నాటి వర్షాలు, వరదల్లో హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో మొత్తం 50 మంది ప్రాణాలు కోల్పోగా, తాజా వర్షాలకు ఇప్పటిదాకా మరో ఇద్దరు చనిపోయారు. వరదలో కొట్టుకుపోయి కంచెలేని ట్రాన్స్ ఫార్మర్లను తాకడంతో మలక్ పేటలో ఓ వ్యక్తి, మంగళ్ హట్ ప్రాంతాల్లో ఐదేళ్ల బాలుడు చనిపోయినట్లు తెలుస్తోంది. సిటీ, శివారులో వానలు దంచికొట్టడంతో మూసీ నది మళ్లీ ఉప్పొంగింది. మూసీ ని ఆనుకుని ఉన్న దాదాపు అన్ని ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేయడంతో గోల్కొండ, లంగర్ హౌజ్, మెహదీపట్నం, పురానాపూల్, చాదర్ ఘాట్, మూసారాంబాగ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
హైవేలు మూసివేత.. మరింత వర్షం..
తాజాగా కురిసిన వర్షాలకు చారిత్రక గోల్కొండలోని ఓ భాగం(కటోరా హౌజ్) ధ్వంసమైంది. కటోరా హౌజ్ గోడ కూలినేలమట్టం అయింది. రాత్రి కురిసిన వానతో మరోసారి హైవేలపై రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాద్-విజయవాడ హైవేను మరోసారి పాక్షికంగా మూసేశారు. వరంగల్-హైదరాబాద్ హైవేపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పల్ చెరువు పూర్తిగా నిండి ప్రమాదకర స్థాయికి చేరడంతో యాదగిరిగుట్ట, వరంగల్ వైపు వెళ్లే వాహనాలన్నీ నిలిచిపోయాయి. విజయవాడ వైపు వెళ్లాల్సిన వాహనాలు సిటీలోనే రాత్రంతా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ప్రమాదకరంగా నీరు చేరడంతో బాలానగర్ చెరువుకు అధికారులు గండికొట్టారు.హైదరాబాద్ లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.