హైదరాబాద్లో భారీ వర్షం .. నోళ్ళు తెరిచిన మ్యాన్ హాల్స్ .. జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ
ఏపీ, తెలంగాణా రాష్ట్రాలను వానలు ముంచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వర్షం దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హైదరాబాద్ నగరంలో గత 24 గంటలుగా కురుస్తున్న వర్షం నగరవాసులను ఇబ్బందులకు గురి చేస్తోంది. నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులపైకి మోకాళ్ళ లోతు వరద నీరు వచ్చి చేరడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Recommended Video
ముంబై పవర్ కట్ ఎఫెక్ట్ .. తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థ హై అలెర్ట్
కాలనీల్లో వరద ఎఫెక్ట్ .. జీహెచ్ఎంసీకి నిన్న రాత్రి వరకే 663 ఫిర్యాదులు
ఎక్కడికక్కడ గంటల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో నగరవాసులు నరకాన్నే చూశారు . వర్షం దెబ్బకు కాలనీలన్నీ జలమయం కావటంతో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు . కాలనీల్లో మ్యాన్ హోల్స్ తెరుచుకోవటం , ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవటంతో నగర వాసులు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తున్నారు. నగరమంతా అస్తవ్యస్తంగా మారటంతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువగా మారింది. నిన్న ఒక్కరోజే రాత్రి 11 గంటల వరకు జీహెచ్ఎంసీకి 663 ఫిర్యాదులు అందాయని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు .
వెల్లువగా మారిన ఫిర్యాదులు .. వర్షంతో జీహెచ్ఎంసీ అధికారుల తిప్పలు
జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ , వెబ్ సైట్ , డయల్ 100, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ప్రజలు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు .ఊపిరాడకుండా అందుతున్న ఫిర్యాదులతో జీహెచ్ఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా జోరున కురుస్తున్న వర్షాలతో పనులు సాగటం లేదు. ఈ పరిస్థితిలో ప్రమాదకరమైన రోడ్లను బ్లాక్ చేస్తున్నారు అధికారులు . సాధ్యమైనంత వరకు ఇళ్ళ నుండి ఈ రెండు రోజులు బయటకు రావద్దని చెప్తున్నారు .
మరో రెండు రోజుల వర్షం .. వణికిపోతున్న నగర వాసులు
అయితే మరో రెండు రోజుల పాటు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు . లోతట్టు ప్రాంతాల ప్రజలు,కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు . ప్రమాదకరంగా ఉన్న పాత భవనాలను ఖాళీ చెయ్యాలని చెప్పిన అధికారులు ఇప్పటికే పలు భవనాలను ఖాళీ చేయించారు .మరోపక్క సీఎం కేసీఆర్ వర్షాల పరిస్థితిని సమీక్షించి అధికారులకు రక్షణా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు . జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు వర్షాల దెబ్బకు భయం గుప్పిట్లో ఉన్నారు .