తెలంగాణను ముంచెత్తుతున్న భారీ వానలు... హైదరాబాద్లో హైఅలర్ట్... కేటీఆర్ కీలక ఆదేశాలు...
గత నాలుగు రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సోమవారం(అక్టోబర్ 12) మధ్యాహ్నం మొదలైన వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం తీరం దాటనుండటంతో మంగళ,బుధవారాల్లోనూ రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో హైఅలర్ట్ ప్రకటించారు.
Recommended Video
వచ్చే 72 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు: ఆ భవనాలకు నోటీసులంటూ కేటీఆర్
గ్రేటర్లో హైఅలర్ట్...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం(అక్టోబర్ 12) నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. సగటున 4సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రధాన రహదారులపైకి నీళ్లు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేసిన అధికారులు.. నగరంలో మరో రెండు రోజులు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉండటంతో హైఅలర్ట్ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు,జీహెచ్ఎంసీ పరిధిలో శిథిల భవనాల్లో నివసిస్తున్నవారిని తక్షణం సురక్షిత షెల్టర్లకు తరలించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
ముగ్గురు మృతి...
గ్రేటర్లో కురుస్తున్న భారీ వర్షానికి హుస్సేన్ ఆలం ప్రాంతంలో ఓ ఇల్లు కూలిపోయి ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. శిథిలావస్థకు చేరుకున్న ఆ ఇల్లు భారీ వర్షానికి కూలినట్లు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని ఏడుగురిని శిథిలాల కింద నుంచి రక్షించాయి. అనంతరం వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులను పర్వీన్ బేగం,అనీస్ బేగంలుగా గుర్తించారు. రాంనగర్ డివిజన్ సంజయ్నగర్ బస్తీలోనూ ఓ పాత గోడ కూలి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్-విశాఖపట్నం మధ్యలో కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో మూడు రోజులు రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తే సూచనలు ఉండటంతో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుంచి ఎస్పీల వరకు డీజీపీ మహేందర్ రెడ్డి అందరినీ అలర్ట్ చేశారు.
ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం...
తెలంగాణలో ఆదివారం(అక్టోబర్ 11) ఉదయం నుంచి సోమవారం ఉదయం నాటికి 1.34 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖమ్మం జిల్లా వెంసూరులో 18.7 సెం.మీ వర్షాపాతం నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో సోమవారం 7 సెం.మీ,జగిత్యాల జిల్లా మన్నెగూడెంలో అత్యల్పంగా 5.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరా బాద్ పరిధిలోని కాప్రాలో 4.6,ఉప్పల్లో 4.1, ఓయూలో 4.0, చర్లపల్లి, బేగంపేటలో 3.8,పీర్జాదిగూడలో 4.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, అర్బన్, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, రంగారెడ్డి సహ హైదారాబాద్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.
తగ్గిన విద్యుత్ వినియోగం...
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దాని ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. భారీ వర్షాలతో వాతావరణం చల్లబడటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం(అక్టోబర్ 12) రాత్రి 8గం. సమయంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 5862 మెగావాట్లు ఉండగా.. గతేడాది ఇదే సమయానికి 7005 మెగావాట్ల డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.