తెలంగాణలోనూ వర్ష బీభత్సం.. మరో నాలుగురోజులు.. అత్యధికంగా జగిత్యాలలో..
ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు తిరిగి ఉన్నది. మరింత బలపడడంతో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇటు తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. సోమవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పిడుగులు కూడా పడ్డాయి.
మూడురోజులు వర్షాలు, హైదరాబాద్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం..
జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 184.3 మిల్లిమీటర్లు, జగిత్యాలలో 175.5 మి.మీ భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మండలాల్లోనూ 90 మిల్లీ మీటర్లకుపైగా వర్షం కురిసింది. వానతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాగుపై నుంచి నీరు ప్రవహించడంతో జగిత్యాల-ధర్మపురి మధ్య, చల్గల్ వద్ద ఒర్రె ఉధృతంగా పారడంతో జగిత్యాల-రాయికల్ మధ్య, గుల్లపేట-పొలాస మధ్య వంతెనపై నుంచి నీళ్లు ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
కామారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నాగిరెడ్డిపేటలో 118.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల బోయినపల్లిలో 100 సిరిసిల్లలో మిల్లిమీటర్లు, 82.5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. నారాయణపేట, మహబూబ్నగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్తోపాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
Recommended Video
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.