దంచి కొట్టిన వానతో.. ట్రాఫిక్ లో చిక్కుకున్న మంత్రి కేటీఆర్..
Recommended Video
భాగ్యనగరంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్న కుండపోతగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం,ద్రోణి ప్రభావంతో రానున్న 48 గంటల్లో హైదరాబాద్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోపక్క హికా తుఫాన్ ముంచుకొస్తున్నట్లు గా తెలుస్తోంది. దీంతో భాగ్యనగర్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. వర్ష ప్రభావంతో ట్రాఫిక్ జామ్ కాగా మంత్రి కేటీఆర్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు.
శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత వాన .. భాగ్యనర్ ను ముంచెత్తుతున్న వర్షం
శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో సెప్టెంబర్ నెలలో రాష్ట్రంలో విస్తారంగా వర్షం కురిసింది. హైదరాబాద్ లో సైతం భారీ వర్షపాతం నమోదైంది. మల్కాజ్గిరి లాంటి ప్రాంతాల్లో 20సెం.మీ వర్షపాతం కురిసింది . నిన్న హైదరాబాద్ లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్, అమీర్పేట, ఎస్సార్నగర్,సైదాబాద్, సంతోష్నగర్, దిల్సుఖ్నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, మలక్పేట్, చాదర్ఘాట్, ఎల్బీనగర్, హయత్నగర్,వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.
ట్రాఫిక్ జామ్ లతో నరకం చూసిన వాహన చోదకులు
హైదరాబాద్ లో వర్ష ప్రభావంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది . వాహనచోదకులు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో నరకాన్ని చూశారు. ఐటీ కారిడార్లో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్సిటీ నుంచి జేఎన్టీయూ వరకు అలాగే మాదాపూర్లోనూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక బంజారాహిల్స్ లో ట్రాఫిక్ జామ్ కావడంతో మునిసిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయారు. చాలా సమయం పాటు కేటీఆర్ ట్రాఫిక్ జామ్ లోనే ఉండాల్సి వచ్చింది.
ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన మంత్రి కేటీఆర్
రోడ్లన్నీ జలమయం కావడంతో వాహన రాకపోకలకు తీవ్ర సౌకర్యం కలిగింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. చెరువులుగా మారిన రోడ్లలో వాహనాలు నడవక, నడపలేక సామాన్యులే కాదు, అటు అధికారులు, ఇటు మంత్రులు సైతం తీవ్ర ఇబ్బందులను పడ్డారు. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ లో మంత్రి కేటీఆర్ కూడా చిక్కుకుపోవడంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు వరద నీరు క్లియర్ చేయడానికి అధికారులను రంగంలోకి దింపింది.
వరదనీరు క్లియర్ చెయ్యటానికి జీహెచ్ఎంసీ సిబ్బంది అగచాట్లు
ఇక ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ట్రాఫిక్ సిబ్బంది నానా పాట్లు పడ్డారు.ఇక నేడు కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసి సిబ్బంది తోపాటు డి ఆర్ ఎఫ్ టీమ్ లను సైతం రంగంలోకి దించి హైదరాబాద్ రోడ్లపై ప్రధాన సమస్యగా మారుతున్న వరదనీరు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయనున్నారు జిహెచ్ఎంసి అధికారులు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ లో చినుకు పడిందంటే రోడ్లన్నీ చిత్తడిగా మారడం, చెరువుల్ని తలపించడం సర్వ సాధారణం అయిపోయింది. అసలే ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే భాగ్యనగర్ వాసులకు అతి పెద్ద చిక్కు అని చెప్పచ్చు.